విశాఖ రైల్వే స్టేషన్ మూసివేత: భారీ భద్రత - రైళ్లు అక్కడి వరకే : ర్యాలీకి ప్లాన్..!!
అగ్నిపథ్ ఎఫెక్ట్ విశాఖ రైల్వే స్టేషన్ పైన పడింది. ఆర్మీ అభ్యర్ధుల నిరసన సికింద్రాబాద్ లో అదుపు తప్పి..భారీ విధ్వంసానికి దారి తీసింది. ఇక, ఈ రోజు విశాఖ నగరంలో ఆర్మీ అభ్యర్ధులు నిరసన ర్యాలీకి సిద్దమయ్యారనే సమాచారం అందటంతో పోలీసులు..ఆర్పీఎఫ్ అప్రమత్తం అయ్యారు. నిఘా విభాగం నుంచి అందుతున్న సమాచారంతో ముందస్తు చర్యలు ప్రారంభించారు. సికింద్రాబాద్ లో చోటు చేసుకున్న పరిణామాలతో భారీ విధ్వంసంతో పాటుగా పోలీసు కాల్పుల వరకు పరిస్థితి దారి తీసింది. ఒక యువకుడు మరణించాడు. అనేక మంది గాయపడ్డారు.
విశాఖ రైల్వే స్టేషన్ లో మందస్తుగా
దీంతో.. ఏపీలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ముందస్తు భద్రతా చర్యలు ప్రారంభించారు. విశాఖలో ఆర్మీ అభ్యర్ధులు ర్యాలీ నిర్వహించేందుకు సిద్దం అవుతున్నారనే సమాచారంతో రైల్వే స్టేషన్ వద్ద మూడంచల భద్రతను కట్టుదిట్టం చేసారు. రైల్వే స్టేషన్ లోని ఎవరినీ అనుమతించటం లేదు. మధ్నాహ్నం 12 గంటల వరకు స్టేషన్ ను మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ లైన్ నుంచి విశాఖ కు వచ్చే రైళ్లను దువ్వాడ వద్ద నిలిపివేస్తున్నారు. అదే విధంగా హౌరా నుంచి విశాఖ వచ్చే రైళ్లను కొత్త వలస స్టేషన్ లో నిలిపివేస్తున్నారు.
రైళ్ల రాకపోకలు అక్కడి వరకే
అక్కడి నుంచి దారి మళ్లిస్తున్నారు. ఇప్పటికే గోదావరి.. గరీభ్ రథ్.. రత్నాచల్ ను దువ్వాడ వద్ద నిలిపివేశారు. స్టేషన్ లోకి ఎవరినీ అనుమతించటం లేదు. నగరంలో ర్యాలీ సమాచారం రావటం..స్టేషన్ల వద్దకు వస్తారనే అంచనాలతో ముందస్తుగా భద్రతను కట్టు దిట్టం చేసారు. స్టేషన్ కు వచ్చే అన్ని మార్గాలను బ్యారికేడ్లతో మూసేసారు. స్టేషన్ బయట పోలీసు సిబ్బంది.. స్టేషన్ ప్రాంగణంలో ఆర్పీఎఫ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. భారీగా భద్రత బలగాలను మోహరించారు. ఇక, గుంటూరులోనూ ఆర్మీ అభ్యర్ధులు తమ నిరసన తెలిపేందుకు సిద్దమయ్యారనే సమాచారం తో పోలీసులు అలర్ట్ అయ్యారు.
అన్ని స్టేషన్ల వద్ద భారీ భద్రత
రైల్వే స్టేషన్ తో పాటుగా.. సమీప స్టేషన్ల వద్ద భద్రతను పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. గుంటూరు రైల్వే స్టేషన్ సమీపంలో గుంపుగా వచ్చిన నిరసనకారులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు ఆర్మీ రిక్రూట్ మెంట్ కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. ముందుగా వాట్సప్.. సోషల్ మీడియా గ్రూపుల్లో సమాచారం షేర్ చేసుకొని వారంతా నిరసనల కోసం వస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో..ఎక్కడా లా అండ్ ఆర్డర్ కు ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలను ముమ్మరం చేసారు. స్టేషన్లలో తీసుకుంటున్న చర్యలకు ప్రయాణీకులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.