కొత్త వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి:అచ్చన్నాయుడు
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను తప్పనిసరి చేసినట్లు రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు 32 లక్షల నంబర్ ప్లేట్లను కొత్త వాహనాలకు అమర్చామని...త్వరలోనే పాత వాహనాలకు కూడా వీటిని అమరుస్తామని చెప్పారు.
Recommended Video
రాష్ట్రంలో మొత్తం కోటికిపైగా వాహనాలకు ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను అమర్చాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. బీపీఎల్ కుటుంబాలకు,ఆటో డ్రైవర్లకు తక్కువ ఫీజు వసూలతో వీటిని అమరుస్తామన్నారు. ద్విచక్ర వాహనాలకు 250, కార్లు, తేలికపాటి వాహనాలకు 400, భారీ వాహనాలకు 600 రూపాయల చొప్పున ఫీజు వసూలు చేస్తామని మంత్రి వివరించారు.
ఎందుకు...ఈ నిబంధన
వాహనాల దొంగతనాలను నియంత్రించేందుకు, ప్రమాదాలను అరికట్టేందుకు సుప్రీం కోర్టు ఆదేశానుసారం రవాణా శాఖలో హైసెక్యూరిటీ రిజిస్ర్టేషన్ నంబర్ ప్లేట్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. 2013 డిసెంబర్ తర్వాత కొత్తగా రిజిస్ర్టేషన్ అయ్యే ప్రతి వాహనానికీ ఆర్టీఏ అధికారుల సమక్షంలోనే నంబర్ ప్లేట్ల్ను బిగించాలని నిబంధన పెట్టారు. అయితే వాహనదారులతో పాటు ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్ గా దృష్టి సారించకపోవడంతో ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇక హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల విషయానికొస్తే వీటిపై లేజర్ బార్ కోడ్, ఒరిజినల్ సెక్యూరిటీ హోలో గ్రామ్, స్మార్ట్ సిమ్లు ఉంటాయి. దీనిపై ముద్రించే 14 అంకెల కోడ్ సాయంతో వాహనం ఎవరిదో తెలుసుకోవచ్చు. ప్లేటు ఒకసారి అతికించిన తర్వాత దాన్ని తీయడం సాధ్యం కాదు. అంతేకాదు ఎన్నోరక్షణ ఫీచర్లు ఈ హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లో ఉన్నాయి.
ఇకపై నిబంధన...కఠినంగా అమలు
అన్ని వాహనాలకు న్యూ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ (ఎన్హెచ్ఎస్ఆర్పీ)ను ఉపయోగించాలనే నిబంధన త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కఠినంగా అమలు చేసేందుకు జిల్లా రవాణా శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొత్త వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల ఏర్పాటు తప్పనిసరి చేయగా క్రమంగా నెలల వ్యవధిలో మిగిలిన అన్ని వాహనాల నంబర్ ప్లేట్లు మార్చి ఎన్హెచ్ఎస్ఆర్పీ నంబరు పేట్లు ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నంబర్ ప్లేట్లు తయారు చే సి విక్రయించేందుకు న్యూ ఢిల్లీకి చెందిన మెస్సర్స్ లింక్ ఆటో టెక్నాలజీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ నంబర్ ప్లేట్ల వల్ల...ఉపయోగాలు...
ప్రస్తుతం ఉన్న నంబర్ ప్లేట్లను వాహన వినియోగదారులు ఎప్పుడైనా మార్చుకునే అవకాశం ఉంది. దీనివల్ల నేరాలకు పాల్పడేవారు నంబర్ ప్లేట్లు తీసివేయడం, మార్చివేయడం చేస్తున్నారు. హై సెక్యూరిటీ ప్లేట్లను ఒక్కసారి వాహనానికి బిగిస్తే తరువాత మార్చడం కష్టం. వాహనానికి చాసిస్ నంబర్, ఇంజన్ నంబర్ ఉన్నట్లే 14 డిజిట్ల బార్ కోడ్ ఉంటుంది. దీని సహాయంతో వాహనానికి ఉపయోగించే నంబర్ ప్లేట్ ఆ వాహనానికి చెందినదా? కాదా?...అని అధికారులు సులభంగా తెలుసుకోవచ్చు. దొంగలు వాహనాన్ని చోరీ చేసిన తరువాత ఈ నంబర్ ప్లేట్లు మార్చుకునే వీలుండదు.
బిగించకపోతే...అదే స్పష్టత లేదు...
కేంద్ర ప్రభుత్వం సూచించిన సంస్థ కాకుండా బయట ప్రైవేటు సంస్థలు తయారు చేసే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు తీసుకున్నట్లు తెలిస్తే వాహన యజమానిపై రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేస్తారు. ఇంతవరకు బాగానే ఉంది...అయితే అసలు హైటెక్ సెక్యూరిటీ ప్లేట్ బిగించుకోకపోతే ఏమవుతుందనే అంశంపై మాత్రం ఎటువంటి స్పష్టత లేదు. అంతేకాదు ప్రస్తుతం అమరుస్తున్న హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు నాసిరకంగా ఉన్నాయని, ఇవి కనీసం ఆరు నెలలుగా కూడా మన్నికగా ఉండటం లేదని వాహనదారులు ఆరోపిస్తుండటం గమనార్హం. వాస్తవానికి అయిదేళ్ల వరకు ఇవి మన్నికగా ఉండాలనేది నిబంధన.కానీ. ప్రస్తుతం జారీ చేస్తున్న నంబర్ ప్లేట్లు నాణ్యత లేకపోవడంతో రంగు తేలిపోయి, వంగిపోయి విరిగిపోతున్నాయి. అయితే ఇవి విరిగితే రుసుం తీసుకొని మళ్లీ కొత్తది ఇచ్చినా ఇబ్బంది ఉండదు...అలా కాకుండా దీనికి కూడా పోలీసు ఎఫ్ఐఆర్ కాపీ అడుగుతుండటంతో తాము అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాహనదారులు వాపోతున్నారు.