బియాస్ ట్రాజెడీ: టి ప్రభుత్వంపై అసహనం, గర్వంగా...
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నదిలో జరిగిన దుర్ఘటన పైన తెలంగాణ ప్రభుత్వం సరిగా స్పందించలేదని గల్లంతైన విద్యార్థి ఆశిష్ సోదరుడు భరద్వాజ్ బుధవారం ధ్వజమెత్తారు. ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా.. గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు ఈ ప్రభుత్వం అక్కడి వారిపై ఒత్తిడి తేలేకపోయిందన్నారు.
చిలకలగూడకు చెందిన ఆశిష్ మంతా బియాస్ నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. ఆశిష్ సోదరుడు భరద్వాజ్ బుధవారం తన ఇంటివద్ద మీడియాతో మాట్లాడారు. ఘటన జరిగి నాలుగురోజులు అవుతున్నా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.
ఘటనాస్థలికి వెళ్లిన హోంమంత్రి గాలింపునకు సరైన చర్యలు తీసుకునేలా చూడాల్సింది పోయి.. శవాలు, బాడీలంటూ మాట్లాడుతున్నారని, ఇది తమకు తీవ్ర ఆవేదన కలిగిస్తోందని కన్నీరు పెట్టుకున్నారు.
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగి నాలుగు రోజులు కావొస్తున్న ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను మాత్రమే కనిపెట్టారని, దీన్ని బట్టి గాలింపు చర్యలు ఎంత నెమ్మదిగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చునని ఆవేదన వ్యక్తం చేశారు. నదిలో కొట్టుకుపోతున్న ఇద్దరు అమ్మాయిలను కాపాడి, తన తమ్ముడు గల్లంతయ్యాడని అటువంటి తమ్ముడు ఉండటం గర్వకారణమన్నారు.
హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం ఐదో రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వైస్ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని, సహాయక సిబ్బంది చేరుకోలేని ప్రాంతాల్లో మానవ రహిత ఏరియల్ వెహికల్తో అన్వేషణ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ... విద్యార్థుల మృతదేహాలను త్వరగా వెలికితీసేందుకు చర్యలు తీసుకున్నారు.