మైక్ సెట్లు, విగ్రహాలు ఇక నామమాత్రపు రేటుకు అందించనున్న టీటీడీ
సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం.. హిందువుల ఆలయాలకు పలు వస్తువులను రాయితీపై అందించనుంది. ఆలయాలకు సంబంధించి మైక్ సెట్, గొడుగులు, శేషవస్త్రం, రాతి- పంచలోహ విగ్రహాలు వంటి వస్తువులు ఇందులో ఉన్నాయి. నిబంధనలకు అనుగుణంగా డీడీతో పాటు పూర్తి చేసిన దరఖాస్తులనుThe Executive Officer, TTD Administrative Building, KT Road, Tirupati. అనే చిరునామాకు పంపాలి.
మైక్ సెట్..
మైక్ సెట్ కొనుగోలుకు అయ్యే ఖర్చు రూ.25,000ల్లో ఏపీకి చెందిన ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం రాయితీ లభిస్తుంది. రూ.2,500ల మొత్తంతో కూడిన డీడీని తీసి పంపించాల్సి ఉంటుంది. ఇతర సామాజిక వర్గానికి 50 శాతం రాయితీతో రూ. 12,500 చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం ఆలయ కమిటీ దరఖాస్తు పత్రం, సంబంధిత ప్రాంతంలోని తహశీల్దార్ / దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ నుండి సిఫార్సు లేఖ, ఆలయం ఫొటో- కరెంట్ బిల్లు, దరఖాస్తుదారు ఆధార్ కార్డును జత చేయాలి.

గొడుగులు..
హిందూ దేవాలయాలకు కేటగిరీలతో సంబంధం లేకుండా అర్హులైన దరఖాస్తుదారులకు రూ.14,500 విలువ చేసే గొడుగులను 50 శాతం రాయితీతో రూ.7,250 టీటీడీ అందిస్తుంది. దీనికోసం ఆలయ కమిటీ దరఖాస్తు పత్రం, సంబంధిత ప్రాంతంలోని తహశీల్దార్ / దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ తో సదరు శాఖ సిఫార్సు లేఖ, దరఖాస్తుదారు ఆధార్ కార్డ్, ఆలయ ఫొటోను జత చేసి దరఖాస్తు చేయాలి. సదరు పత్రాలతోపాటు రాయితీ మినహాయించి రూ. 7,250/- లకు డి.డిను జత చేసి పంపాలి.
శేషవస్త్రం..
హిందూ దేవాలయాలకు ఉచితంగా శేష వస్త్రాన్ని టీటీడీ ఉచితంగా అందిస్తోంది. దీనికి డీడీ అవసరం లేదు. ఆలయ అభ్యర్థన లేఖను కార్యనిర్వాణాధికారి, తిరుపతి పేరుతో దరఖాస్తు చేయాలి. సంబంధిత ప్రాంతంలోని తహశీల్దార్ / అసిస్టెంట్ కమిషనర్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి సిపార్సు లేఖ, దరఖాస్తు దారు ఆధార్ కార్డు, ఆలయ ఫోటోను జత చేయాలి.
రాతి- పంచలోహ విగ్రహాలు..
శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతీ అమ్మవారి రాతి విగ్రహాలను 5 అడుగులు, అంతకంటే తక్కువ ఎత్తులో ఉన్న విగ్రహాలను ఉచితం. మిగిలిన దేవతా విగ్రహాలకు 75 శాతం సబ్సిడీ లభిస్తుంది. 25 శాతం ధరను చెల్లిస్తే సరిపోతుంది. ఏపీ, తెలంగాణకు చెందిన ఎస్సీ ఎస్టీలకు వారికి ఉచితంగా రాతి విగ్రహాలను అందిస్తారు. పంచలోహ విగ్రహాలపై 90 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఇతర సామాజిక వర్గాల వారు పంచలోహ విగ్రహాలకు 75 శాతం సబ్సిడీ చెల్లించాలి.
దేవతా మూర్తుల రాతి- పంచలోహల విగ్రహాల పేర్లు, కొలతలతో కార్యనిర్వహణాధికారికి ఆలయ అభ్యర్థన లేఖ పంపించాలి. దరఖాస్తుదారులు ఖచ్చితంగా స్థానిక తహసీల్దార్ / అసిస్టెంట్ కమీషనర్ నుండి సదరు ఎండోమెంట్ శాఖ తాజా సిఫార్సు లేఖ, ఏ4 సైజ్ లో ఆలయ బ్లూఫ్రింట్, అవసరమైన విగ్రహాల డ్రాయింగ్, ఒరిజినల్ ఆలయ ఫోటో, దరఖాస్తుదారు ఆధార్ కార్డును జత చేయాలి. ఎంఈవో లేదా డీఈవో ఆమోదం పొందిన విద్యా సంస్థలు సరస్వతీ దేవీ రాతి విగ్రహాన్ని 50 శాతం సబ్సిడీతో పొందవచ్చు












Click it and Unblock the Notifications