Air India: అమెరికా హెచ్చరిక.. ఆ విమానాల్లో కీలక మార్పులు!
ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చే ఎయిర్ ఇండియా తన విమానాల సాంకేతిక ప్రమాణాలను మరింత మెరుగుపరిచే పనిలో పడింది. అమెరికాకు చెందిన విమానయాన నియంత్రణ సంస్థ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) జారీ చేసిన భద్రతా ఆదేశాల మేరకు, తన ఆధీనంలోని కొన్ని బోయింగ్ 787 డ్రీమ్లైనర్ (Boeing 787 Dreamliner) విమానాల్లో ఎయిర్ ఇండియా కీలక మార్పులు వేగవంతంగా చేపడుతోంది.
బోయింగ్ 787 సిరీస్కు చెందిన కొన్ని మోడళ్లలో విమానం తలుపులు తెరిచేందుకు ఉపయోగించే 'డోర్ అసిస్ట్ హ్యాండిల్స్' ఊడిపోతున్నట్లు విమాన సర్వీసుల ముందు జరిపే తనిఖీల్లో వెల్లడైంది. ఇలా హ్యాండిల్స్ ఊడిపోవడం వల్ల అత్యవసర సమయాల్లో ప్రయాణికులను లేదా సిబ్బందిని వేగంగా బయటకు తరలించడానికి తీవ్ర విఘాతం కలుగుతుందని FAA ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా తలుపులు తీసేటప్పుడు ప్రయాణికులు, సిబ్బంది గాయపడే ప్రమాదం ఉందని గుర్తించిన నియంత్రణ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలకు తగిన మార్పులు చేయాలని ఆదేశించింది.

ఎయిర్ ఇండియా విమానాల పరిస్థితి ఏమిటి?
ప్రస్తుతం ఎయిర్ ఇండియా వద్ద 35 బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాలు ఉన్నాయి. అందులో 26 పాత మోడళ్లు ఉండగా, మరో తొమ్మిది కొత్త రకానికి చెందినవి. అమెరికా సంస్థ సూచించిన గైడ్లైన్స్ ప్రకారం.. ఎయిర్ ఇండియా తన వద్ద ఉన్న డ్రీమ్లైనర్లలో అవసరమైన సాంకేతిక మార్పులను దశలవారీగా చేపడుతోంది. ఇప్పటికే కొన్ని విమానాల్లో ఈ హ్యాండిల్ సపోర్ట్ భాగాలను కొత్త పార్టులతో రీప్లేస్ చేయడం పూర్తయినట్లు సమాచారం.
ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేదు!
ఈ మార్పుల వల్ల ప్రస్తుతం నడుస్తున్న విమానాల రాకపోకలకు గానీ, ప్రయాణికుల సర్వీసులకు గానీ ఎలాంటి ఆటంకం కలగడం లేదని సంస్థ వర్గాలు స్పష్టం చేశాయి. రోజువారీ విమానాల నిర్వహణ షెడ్యూల్కు భంగం కలగకుండా, విమానాలు నేలపై ఉండే సమయంలోనే ఈ సాంకేతిక సరిదిద్దే పనులను జరుపుతున్నారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications