అసెంబ్లీ లాబీల్లో బాలకృష్ణ నోటివెంట ఆసక్తికర వ్యాఖ్య
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జిల్లాల సంఖ్యను పెంచనున్నట్లు గతంలో మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ జిల్లాల పెంపుపై తాజాగా అసెంబ్లీ లాబీల్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ జిల్లాల సంఖ్యను 14కు పెంచనున్నారట. ఇంతకీ ఆ కొత్త జిల్లా పేరేమిటీ? ఏ జిల్లాను విడగొట్టి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయనున్నారనే విషయాన్ని మాత్రం టాలీవుడ్ ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని అడగాల్సిందే.

ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద, కరువు కాటకాలతో కొట్టుమిట్టాడుతున్న అనంతపురం జిల్లాలోని హిందూపురం ప్రాంతాన్ని ఏపీ ప్రభుత్వం ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కసరత్తును ప్రారంభించినట్లు స్వయంగా బాలకృష్ణ మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీల్లో చెప్పారట.
అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో అసెంబ్లీ లాబీల్లో పిచ్చాపాటిగా మాట్లాడిన సందర్భంగా బాలకృష్ణ హిందూపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని చెప్పారు. ఫిబ్రవరి 27, 28 తేదీల్లో అంగరంగవైభవంగా నిర్వహించిన లేపాక్షి ఉత్సవాలను రాబోయే రోజుల్లో రెండేళ్లకొకసారి నిర్వహించనున్నట్లు కూడా బాలకృష్ణ చెప్పారు.
లేపాక్షిని అంతర్జాతీయ చారిత్రక సంపదగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితికి లేఖ రాసినట్లు కూడా ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications