తప్పించుకోలేరు - శిక్ష తప్పదు: హోం మంత్రి వనిత..!!
సిట్ కొనసాగింపుపై సుప్రీం ఇచ్చిన తీర్పు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తోంది. విచారణ లాజికల్ కన్ క్లూజన్ కు వచ్చిన తరువాత అరెస్టులు ఉంటాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల చేసిన కామెంట్స్ తో ఈ వ్యవహారం రాజకీయంగా మలుపు తీసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే తమ పార్టీ నేతల పైన కేసులన్నీ పెట్టారని..సిట్ వేస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. ఇప్పుడు ఇదే అంశం పైన హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. దోషులు ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేసారు.
అమరావతి భూముల కుంభకోణంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తుకు ప్రభుత్వం చేసిన అప్పీల్ ను పరిగణనలోకి తీసుకుని మళ్లీ విచారణ జరిపించండని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. సిట్ ఏర్పాటుపై 'స్టే' విధిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిందన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరగకపోతే దర్యాప్తును ప్రాథమిక దశలోనే ఎందుకు అడ్డుకున్నారని హోంమంత్రి ప్రశ్నించారు.

విచారణ జరిగితే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు బయటపడతాయన్న భయంతోనే ప్రాథమిక విచారణలో ఉండడానే హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నారని పేర్కొన్నారు. తప్పు చేశామని భయం ఉండబట్టే స్టే తెచ్చుకున్నారన్నారు. గతంలో కూడా ఈ అంశంపై మంత్రివర్గ ఉప సంఘం వేసినప్పుడు భూముల కొనుగోళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలను అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చారని తెలిపారు. దర్యాప్తు ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వడం సరైంది కాదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతంలో జరిగిన ప్రతి అంశాన్ని పారదర్శకంగా విచారణ చేస్తామన్నారు. దోషులు ఎవరూ తప్పించుకోలేరని, ఎప్పటికీ సత్యమే గెలుస్తుందని వనిత చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications