హాస్టల్ సిబ్బంది నిర్వాకం: విద్యార్థులకు మద్యం తాగించి, డ్యాన్సులు
విజయనగరం: జిల్లాలోనీ చీపురుపల్లి బీసీ హాస్టల్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ సిబ్బంది మద్యం సేవిస్తూ అక్కడికి వచ్చిన విద్యార్థులకు కూల్ డ్రింక్స్లో మద్యం కలిపి ఇచ్చారు. ఆ తర్వాత ఆ పానీయం సేవించిన విద్యార్థులు ఊగిపోయారు.
కాగా, వారితో డ్యాన్సులు చేయిస్తూ సిబ్బంది ఎంజాయ్ చేయడం గమనార్హం. ఈ ఘటన బహిర్గతం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది మద్యం తాగించిన విద్యార్థులంతా ఐదు, ఆరు తరగతులు చదువుతున్నవారే కావడం గమనార్హం.

కాగా, చీపురుపల్లి బీసీ హాస్టల్ సిబ్బంది కూల్ డ్రింక్స్లో మద్యం కలిపి విద్యార్థులతో తాగించడం వాస్తవమేనని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ విజయనగరం అర్బన్ సహాయ అధికారి సీహెచ్ పైడిరాజు తెలిపారు. ఆయన పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా వసతిగృహంలో బస చేసేందుకు మంగళవారం రాత్రి విచ్చేశారు.
వసతిగృహం సిబ్బంది విద్యార్థులతో మద్యం తాగించిన ఘటనపై ఆయన విచారణ జరిపారు. ఆదివారం సాయంత్రం ఏం జరిగిందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులతో కమాటి మద్యం తాగించడం వాస్తవమేనన్నారు. మద్యం తాగించిన కమాటీని సస్పెండ్ చేయాలని, మిగతా సిబ్బందిని బదిలీ చేయాలని, అలాగే హాస్టల్ ఇంఛార్జీపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫారస్సు చేస్తానని పైడిరాజు తెలిపారు.












Click it and Unblock the Notifications