సెటైర్: పవన్ కళ్యాణ్పై కల్వకుంట్ల కవిత లెక్క!
హైదరాబాద్: రాజకీయ ప్రత్యర్థులపై రాజకీయ బాణాలు విసరడంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత తండ్రి కెసిఆర్ నుంచి చాలానే నేర్చుకున్నట్లున్నారు. సర్వేలో పాల్గొనకపోవడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తమ పార్టీ మాజీ నేత విజయశాంతిలపై విసిరిన వాగ్బాణాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
వారిద్దరు వివరాలు ఇవ్వకపోవడం వల్ల సమగ్ర కుటుంబ సర్వే స్థాయి ఏమీ తగ్గలేదని ఆమె అన్నారు. సర్వేను తెలంగాణ ప్రజలు విజయవంతం చేశారని ఆమె అన్నారు. సర్వేలో పాల్గొననివారు మనుషుల కిందికి లెక్కకు వస్తారా అని అమె అన్నారు. పవన్ కళ్యాణ్, విజయశాంతిలను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్య చేశారు.
ఆంధ్రప్రదేశ్ లేదా సీమాంధ్ర ప్రజలను వేరు చేయడానికి ఇంత భారీ సర్వే చేయాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. కాగా, పవన్ కళ్యాణ్ సర్వేలో పాల్గొనకపోవడంపై కెసిఆర్ కూడా తీవ్రంగా స్పందించారు. సర్వేలో పాల్గొనకపోవడం సామాజిక నేరమని అన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ సామాజిక నేరస్థుడవుతాడా అంటూ మీడియాలో కథనాలు ప్రారంభమయ్యాయి.
కెసిఆర్ వ్యాఖ్యకు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను ఇంట్లో లేకపోవడం వల్ల వివరాలు అందించలేదని అంటూనే రాష్ట్ర విభజన పూర్తయిన తర్వాత కూడా కెసిఆర్ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సరి కాదని అన్నారు.