అమరావతిలో మరో కూకట్ పల్లి ఏర్పాటు చేస్తున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. అర్హులైన నిరుపేదలు అందరికీ 2029 కల్లా శాశ్వత గృహ వసతిని కల్పించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న గృహ నిర్మాణ శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
త్వరలోనే గృహ నిర్మాణాల కోసం సర్వే
రానున్న వంద రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల గృహ నిర్మాణాలు పూర్తిచేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం జరిగిందని పేర్కొన్నారు. హైదరాబాదులోని సంజీవరెడ్డి నగర్, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు తరహాల్లో కేంద్ర పథకాల ఆసరాతో మద్యతరగతి, దిగువ మద్య తరగతి వర్గాలకు మరియు జర్నలిస్టులకు సరసమైన ధరలకే ఇళ్లను నిర్మించాలని చంద్రబాబు ఆదేశించారని, అందుకు తగ్గట్టుగా త్వరలోనే సర్వే నిర్వహించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు మంత్రి తెలిపారు.

ప్రభుత్వ నిర్ణయం చెప్పిన మంత్రి
ఇకపై ఏపీలో ఇల్లు లేని నిరుపేద లబ్దిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లే అవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్దిదారులకు చెల్లింపులు చేయకుండా ఇబ్బంది పెట్టింద్ననారు. బాధిత లబ్దిదారులకు వెంటనే చెల్లింపులు జరపాలని చంద్రబాబు ఆదేశించిన్నట్టు వెల్లడించారు.
గత ప్రభుత్వం స్థలాలిచ్చిన చోట మౌలిక వసతుల కల్పన
పోలవరం ఆర్ అండ్ ఆర్ కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగించే అంశంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. చాలా చోట్ల గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చి, మౌలిక సదుపాయాలను కల్పించలేదని, అటు వంటి లేవుట్లలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్టు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అడుగడుగునా పేదలకు మోసం జరిగిందన్నారు.
కేంద్ర సహకారంతో ఏపీలో ఇళ్ళు
రూ.4.00 లక్షల యూనిట్ కాస్టుతో ఇళ్లను వచ్చే ఏడాది మార్చి నుండి మంజూరు చేయడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం
బడ్జెట్ లో ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారిని గుర్తించి వారికి లబ్ది చేకూర్చే దిశగా త్వరలోనే సర్వే కూడా చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ పి.ఎం.ఏ.వై. పథకం ఆసరాతో చేపట్టిన గృహాల్లో ఇంకా 8 లక్షల గృహాలు నిర్మాణంలో ఉన్నాయని , వాటి కూడా తమ ప్రభుత్వం పూర్తిచేయనున్నట్లు మంత్రి తెలిపారు.
కోర్టు కేసుల్లో ఉన్న ఇళ్ళు నిర్మించుకోలేని వారికి శుభవార్త
పిఎంఏవై 2.0 ప్రకారం కొత్తగా లబ్దిదారులను ఎంపిక చేసి ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు . కోర్టు కేసుల్లో ఉండి ఇళ్లు నిర్మించుకోవడానికి అవకాశం లేని చోట, సంబందిత లబ్దిదారులకు ఇళ్లు ఇచ్చే అవకాశం కొత్త పధకంలో ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications