జగన్ సర్కార్ కు భారీ ఊరట-టీడీపీ ఆరోపణలకు చెక్-నీతి ఆయోగ్ మాజీ వైస్ ఛైర్మన్ క్లారిటీ !
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయాల్లో వాస్తవాలతో సంబంధం లేకుండా అలవోకగా ఆరోపణలు, ప్రత్యారోపణలు తెరపైకి వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత దీనిపై ఎవరో ఒకరు వాస్తవాలు బయటపెడితే మాత్రం ఆ తర్వాత పార్టీలు తమ ఆరోపణలపై సైలెంట్ అయిపోతున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన చోటు చేసుకుంది. ఇందులో అధికార వైసీపీని ఇరుకునపెట్టేందుకు టీడీపీ చేస్తున్న ప్రచారానికి నీతి ఆయోగ్ మాజీ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియా పరోక్షంగా చెక్ పెట్టారు.
వైసీపీ-టీడీపీ విమర్శల రాజకీయం
ఏపీలో ఇప్పుడు రెండు ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ, టీడీపీ ఇద్దరూ ఒక విషయంలో మాత్రం ఒకే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. అది ప్రత్యర్ధులపై కొత్తగా ఓ ఆరోపణ చేయడం, దానికి సమాధానం చెప్పలేక వారు ఇబ్బందులు పడటం, తిరిగి ఎదురుదాడికి దిగడం ద్వారా వీరికి కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించడం సర్వసాధారణమవుతోంది. ముందస్తు ఎన్నికల సంకేతాల నేపథ్యంలో ఇలా ప్రత్యర్ధుల్ని మానసికంగా దెబ్బకొట్టేందుకు సాగుతున్న ఈ వార్ లో ఒక్కోసారి ఒక్కొక్కరిది పైచేయి అవుతుంది. మరో సమయంలో మరొకరికి పైచేయి లభిస్తోంది. దీంతో వైసీపీ, టీడీపీ మధ్య ఈ వార్ పై సాధారణ కార్యకర్తలు సైతం చర్చించుకుంటున్నారు.
ఏపీలో శ్రీలంక తరహా సంక్షోభం
ఏపీలో రాజకీయానికి కానీ, ఇక్కడి పరిస్ధితులకు కానీ భారత్ పొరుగుదేశం శ్రీలంకతో ఎలాంటి పోలిక కానీ, సంబంధం కానీ లేదు. కానీ శ్రీలంకలో రాజపక్సల పాలనతో తలెత్తిన ఆర్ధిక సంక్షోభాన్ని సాకుగా చూపుతూ ఏపీలో జగన్ సర్కార్ చేస్తున్న అప్పులతో రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ టీడీపీ ఓ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. వాస్తవానికి కేంద్రంలో ఎన్డీయే సర్కార్ పైనా విపక్షాలు ఇలాంటి ప్రచారమే మొదలుపెట్టడంతో దీనిపై దేశవ్యాప్తంగా అన్ని చోట్లా చర్చ జరుగుతోంది. దీనిపై ఆర్ధిక వేత్తలు కూడా స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో గతంలో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ గా పనిచేసిన అరవింద్ పనగరియా కూడా స్పందించారు.
శ్రీలంకతో పోలిక లేదన్న పనగరియా
శ్రీలంక సంక్షోభంతో భారత్ లో పరిస్ధితుల్ని పోలుస్తూ పలు రాజకీయ పార్టీలు, నేతలు సాగిస్తున్న ప్రచారంపై నీతి ఆయోగ్ మాజీ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియా తీవ్రంగా స్పందించారు. శ్రీలంక పరిస్ధితుల్ని భారత్ లో పోల్చడం సిల్లీగా ఉందన్నారు. భారత్ లో ద్రవ్యలోటు అధిగమించడానికి అనుమతించడం లేదని, కేవలం కరెంటు ఖాతా లోటు తగ్గించుకోవడానికి మారక విలువ మాత్రమే తగ్గిస్తున్నట్లు పనగరియా చెప్పారు. అలాగే భారత్ తీసుకునే రుణాల గురించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఏ విధంగా చూసినా భారత్ లో ఆర్ధిక పరిస్ధితులు, విధానాలకు శ్రీలంకతో పోలిక లేదన్నారు. దీంతో పనగరియా కామెంట్స్ ఇప్పుడు శ్రీలంకతో భారత్ ను పోలుస్తున్న వారందరికీ షాకిచ్చాయి.
జగన్ సర్కార్ కు భారీ ఊరట
ఏపీలో ప్రభుత్వం చేస్తున్న అప్పులతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ టీడీపీ చేస్తున్న ప్రచారానికి తాజాగా నీతి ఆయోగ్ మాజీ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియా చేసిన వ్యాఖ్యలతో కౌంటర్ పడినట్లయింది. భారత్ లో ఆర్దిక విధానాలకూ, శ్రీలంక విధానాలకూ పోలికే లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో అధికార వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు అర్ధంపర్ధం లేని విమర్శలు చేస్తూ రాష్ట్రం పరువు బజారుకీడ్చడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జగన్ సర్కార్ అప్పులపై మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఎంతో బెటరన్న గణాంకాలు బయటపెట్టారు. ఇప్పుడు పనగరియావ్యాఖ్యలతో శ్రీలంక పేరుతో టీడీపీ చేస్తున్న ఆరోపణలు పసలేనివని తేలిపోతున్నాయి.