నోట్ల రద్దు బాబుకు ముందే ఎలా తెలుసు: బొత్స డౌట్, జగన్పై యనమల
విజయవాడ: రూ.500, రూ.1000 నోట్లు రద్దు విషయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ముందే ఎలా తెలిసిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ బుధవారం నాడు ప్రశ్నించారు. చంద్రబాబు, మంత్రుల పైన కేంద్రం నిఘా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో చంద్రబాబు వెనుక ఉండి తనపై హైకోర్టులో కేసు వేయించారని, తాను స్టేకు వెళ్లలేదని బొత్స చెప్పారు. టిడిపి నాయకులు జోకర్లుగా మారారని ఎద్దేవా చేశారు. పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వద్ద డబ్బు ఉంటే టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి విచారణ జరిపించుకోవచ్చునని సవాల్ విసిరారు. ప్రధాని మోడీ నిర్ణయాన్ని వైసిపి స్వాగతిస్తోందన్నారు.
ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండాలని తమ పార్టీ కోరుకుంటోందని చెప్పారు. దేశంలో 38వేల బ్యాంకులు మాత్రమే ఉన్నాయని, బ్యాంకుల సంఖ్యను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది కలిగినప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ పార్టీ మద్దతిస్తుందని చెప్పారు.
లక్ష కోట్లను వెలికి తీస్తామని చెప్పాం: యనమల
ఇడుపులపాయ బంకర్లో దాచిన లక్ష కోట్ల రూపాయలను వెలికి తీస్తామని మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం నాడు అన్నారు. నల్ల ధనం పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి చెప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
పెద్ద నోట్ల రద్దు వల్ల పేద, మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. లోటు బడ్జెట్ను భర్తీ చేసేందుకు ప్రజల పైన ఎలాంటి పన్నులు విధించబోమని తేల్చి చెప్పారు. నల్లధనాన్ని వెలికితీసి పేదల సంక్షేమానికి ఉపయోగిస్తామన్నారు.