"నోట్ల రద్దు బాబుకు ముందే తెలుసు.. అందుకే హెరిటేజ్ అమ్మేశారు"
ఎన్నికల్లో ఓటేయడానికి డబ్బు తీసుకోవడం.. ఎమ్మెల్యేలను కొనడం వంటి చర్యలు అవినీతి నిరోధక చట్టం కిందకు రావంటూ లూథ్రా వాదించడం విస్మయం కలిగిస్తోందన్నారు.
విజయవాడ : ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు తరుపున వాదిస్తున్నన్యాయవాది సిద్దార్థ లూథ్రా తీరును తప్పుబట్టారు వైసీపీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ. కేసుకు సంబంధించి లూథ్రా కొత్త భాష్యం చెప్పారని అభిప్రాయపడ్డారు.
ఎన్నికల్లో ఓటేయడానికి డబ్బు తీసుకోవడం.. ఎమ్మెల్యేలను కొనడం వంటి చర్యలు అవినీతి నిరోధక చట్టం కిందకు రావంటూ లూథ్రా వాదించడం విస్మయం కలిగిస్తోందన్నారు.
ఇలాంటి వాదనలను తెరపైకి తీసుకురావడం ద్వారా.. చంద్రబాబు ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు బొత్స. ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఇప్పటికీ ఆ వాయిస్ తనది కాదని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు. నేను నిప్పు అని పదేపదే చెప్పే చంద్రబాబు.. ప్రజలకు చెప్పాలనుకున్నది ఇదేనా? అంటూ మండిపడ్డారు.
ఇక ఆస్తుల విషయాన్ని ప్రస్తావిస్తూ.. తన ఆస్తి రూ.50లక్షలు అని చెప్పుకునే చంద్రబాబు.. లాయర్ లూథ్రాకు రూ.10లక్షలు ఒక్కరోజుకు ఎలా చెల్లిస్తున్నారని ప్రశ్నించారు. ఓవైపు పెద్ద నోట్లను రద్దు చేయమని చెప్పిందే నేనే అంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు.. మరోవైపు అవే పెద్ద నోట్లను తన అనుచరులకు లంచంగా ఇచ్చి పంపిస్తారని ఎద్దేవా చేశారు.
హెరిటేజ్ ను అందుకే అమ్ముకున్నారు :
నోట్ల రద్దు విషయం గురించి సీఎం చంద్రబాబు సహా టీడీపీ నేతలందరికీ ముందే తెలుసునని ఆరోపించారు బొత్స. ముందస్తు సమాచారం ఉంది కాబట్టే.. బ్లాక్ ను వైట్ గా మార్చుకునే ప్రయత్నంలో హెరిటేజ్ సంస్థను అమ్మేశారని ఆరోపించారు.
ఇక హోదా గురించి ప్రస్తావిస్తూ.. అంశాన్ని చిన్నగా తెరుమరుగే చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ కు కనీసం మండల కమిటీ ఎలా వేయాలన్న అవగాహన కూడా లేదని ఈ సందర్బంగా ఆయన ఎద్దేవా చేశారు.