రాకియాపై జగన్ పంతం నెగ్గిందిలా- విశాఖ టూ లండన్ కోర్టు-న్యాయపోరాటంలో గెలుపు
ఏపీలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పురుడుపోసుకున్న విశాఖ మన్యం బాక్సైట్ తవ్వకాల వ్యవహారం ఎన్నో మలుపులు తిరిగి చివరకు లండన్ కోర్టులో సుఖాంతమైంది. గతంలో విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వి ఇస్తామంటూ దుబాయ్ కు చెందిన రస్ అల్ ఖైమా సంస్ధతో కుదుర్చుకున్న ఒప్పందం ఉల్లంఘించిన ఏపీ ప్రభుత్వం.. ఈ వ్యవహారంలో రాకియా దాఖలు చేసిన పిటిషన్ పై లండన్ కోర్టు వరకూ వెళ్లి పోరాడి గెలిచింది.

రాకియా బాక్సైట్ డీల్
2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లాలో ఉన్న బాక్సైట్ ను వినియోగించుకుని అల్యూమినియం పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు రాకియాతో అప్పటి రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందుకు గానూ రాకీయా తన జాయింట్ వెంచర్ సంస్థ ఎన్ రాక్ ద్వారా ఏర్పాటు చేసే అల్యూమినియం పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (ఎపిఎండిసి) ద్వారా బాక్సైట్ సరఫరా చేసేట్టుగా ఒప్పందం కుదిరింది. అయితే విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల వల్ల గిరిజన సంస్కృతికి విఘాతం ఏర్పడుతుందని స్థానికుల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్ బాక్సైట్ సరఫరా ఒప్పందాన్ని రద్దు చేసింది.

లండన్ కోర్టుకెక్కిన రాకియా
ఇదే క్రమంలో ఇండియా, యుఎఇల మధ్య ఉన్న బిఐటి ఒప్పందంను ఆసరాగా చేసుకుని రాకియా సంస్థ తమకు బాక్సైట్ సరఫరా చేయపోవడం వల్ల నష్టపోయామంటూ లండన్ ఆర్బిట్రేషన్ కోర్ట్ లో కేసు వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం ప్రకారం తమకు బాక్సైట్ ఇవ్వకపోవడం వల్ల తాము అల్యూమినియం పరిశ్రమ కోసం పెట్టిన పెట్టుబడులకు నష్టం కలిగిందని, అందుకు గానూ తమకు నష్టపరిహారం ఇవ్వాలంటూ రాకీయా సంస్థ లండన్ ఆర్బిట్రేషన్ కోర్ట్ లో వాదనలు వినిపించింది. ఈ కేసులో దాదాపు 273 మిలియన్ డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. మధ్యవర్తిత్వం ద్వారా ఈ కేసును పరిష్కరించుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించింది. పలుసార్లు ప్రభుత్వం తరుఫున ప్రతినిధులు రాకియా తో సంప్రదింపులు జరిపినా రాకీయా అంగీకరించలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా న్యాయపోరాటానికి సిద్ధమైంది.

లండన్ కోర్టులో గెలిచిన ఏపీ
రాకియా పిటిషన్ పై సీఎం జగన్ సూచనలతో అధికారులు పకడ్భందీగా లండన్ ఆర్బిట్రేషన్ కోర్ట్ లో తమ వాదనలను వినిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గనులశాఖ ఉన్నతాధికారులు, ఎపిఎండిసి అధికారులు, న్యాయనిపుణులు లండన్ కోర్ట్ లో బాక్సైట్ ఒప్పందాల రద్దు పర్యవసానాలను బలంగా వినిపించారు. దీనితో లండన్ న్యాయస్థానం ఎపి ప్రభుత్వం తరుఫున ప్రతినిధులు వినిపించిన వాదనలతో ఏకీభవిస్తూ, ఈ కేసు తమ పరిధిలోకి రాదని కేసు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట లభించినట్లయింది.












Click it and Unblock the Notifications