మోడీకి జగన్ పార్టీ ఎంపీల ప్రశ్నలు, రేపు చంద్రబాబు వద్దకు వైసిపి ఎమ్మెల్యేలు
రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రకటన తర్వాత విదేశాల నుంచి ఎంత నల్లధం తెచ్చారో చెప్పాలని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గురువారం ప్రశ్నించారు.
న్యూఢిల్లీ/విజయవాడ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రకటన తర్వాత విదేశాల నుంచి ఎంత నల్లధం తెచ్చారో చెప్పాలని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గురువారం ప్రశ్నించారు. నోట్ల రద్దు విషయమై తమ పార్టీ అధినేత వైయస్ జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారని చెప్పారు.
నోట్ల రద్దు పైన కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ముందస్తు చర్యలు లేకుండా నోట్ల రద్దు తీసుకోవడాన్ని తాము ప్రశ్నిస్తున్నామని చెప్పారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకోకపోవడం దారుణమని వైసిపి ఎంపీలు అన్నారు.
చంద్రబాబు అపాయింటుమెంట్ దొరకట్లేదు: పిన్నెల్లి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవనున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అందరూ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఆయనను కలవనున్నట్లు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి చెప్పారు.
పదిహేను రోజుల నుంచి ముఖ్యమంత్రి అపాయింటుమెంట్ అడుగుతుంటే ఇవ్వడం లేదన్నారు. నియోజకవర్గ నిధుల గురించే తాము అపాయింటుమెంట్ కోరామని చెప్పారు. కానీ చంద్రబాబు ఇవ్వడం లేదన్నరు. ఈ నేపత్యంలో సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్తున్నట్లు పిన్నెళ్లి చెప్పారు.