నిన్నటిదాకా మిత్రుడు.. ఇప్పుడు శత్రువు : పవన్ 'ఎమ్మెల్యే' ఎంట్రీతో టీడీపీకి దెబ్బేనా?
అనంతపురం : తిరుపతి, కాకినాడ సభలతో పోల్చి చూసుకుంటే.. నిన్నటి అనంత సభలో పవన్ ప్రసంగించిన తీరును కాస్తంత పరిణితినే కనబరిచిందని చెప్పాలి. మునుపటిలా సన్నాయి నొక్కులను పక్కనబెట్టి.. ప్రజలను మోసం చేయాలని చూస్తే.. తానో బలమైన శత్రువుగా మారుతానని టీడీపీకి పరోక్షంగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
చట్టసభల్లోకి ఎంట్రీ ఇస్తారా? ఇవ్వరా? ఇంకెన్నాళ్లిలా మరో పార్టీకి మద్దతూ పలుకుతూ పోతారు. సొంతంగా పార్టీ నిర్మాణం చేపట్టరా? లాంటి ప్రశ్నలన్నింటిపై పవన్ నుంచి చాలావరకు స్పష్టత వచ్చింది. ఒకవిధంగా ఇన్నాళ్లు కాస్త వేచి చూసే ధోరణితో వ్యవహరించిన పవన్.. ప్రభుత్వ తీరులో ఎక్కడా మార్పు కనిపించకపోవడంతో.. ప్రజల కోసం దేనికైనా ఎదురెళ్లాలని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని తన ప్రసంగంలోను స్పష్టం చేశారు.
ఆ విషయంలో మాత్రం పవన్ తీరు మారదా!
అంతా బాగానే ఉన్నా.. రాజకీయాల్లో సింగిల్ జర్నీనే ఎక్కువ కాలం కొనసాగిస్తే.. జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలున్నాయి. గత సభల్లో మాదిరిగానే నిన్నటి అనంత సభలోను పవన్ ఒక్కరే సభా వేదికపై దర్శనమిచ్చారు. అయితే అనంత నుంచే పార్టీ నిర్మాణం మొదలవబోతుందని చెప్పారు కాబట్టి.. పార్టీని బలోపేతం చేసిన తర్వాత ఈ తీరులో మార్పు రావచ్చునేమో!.
రాజకీయాల్లో సమాలోచనలు, ప్రజలతో సమన్వయం చాలా ముఖ్యం. అన్ని సందర్బాల్లో.. పార్టీ అధినేతలే కలగజేసుకోవాలంటే కుదరని పని. కాబట్టి.. పార్టీ నిర్మాణంతో పాటు పార్టీలో ధీటైన నేతలను తయారుచేయడంలోనే పవన్ భవిష్యత్తు రాజకీయం ఆధారపడి ఉంది.
టీడీపీకి నష్టమేనా..!
ప్రత్యేక హోదాపై పవన్ టీడీపీకి ఎదురెళ్లడానికి సిద్దపడ్డారన్న విషయం నిన్నటి అనంత సభతో స్పష్టమైంది. ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రభుత్వానికి తానో బలమైన శత్రువుగా వ్యవహరిస్తానంటూ ప్రకటించారు. దీన్నిబట్టి.. భవిష్యత్తులో మూడో రాజకీయ ప్రత్యామ్నాయంగా జనసేన అడుగులను ఇప్పటినుంచే బలంగా మలచబోతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
2014 నాటి పరిస్థితిని.. ఇప్పటి పరిస్థితిని విశ్లేషించుకుంటే.. అప్పుడు టీడీపీపై నమ్మకంతో.. ఆ పార్టీకి అండగా నిలిచిన పవన్.. ఇప్పుడదే పార్టీని టార్గెట్ చేసి ముందడుగు వేస్తున్నారు. ఒకరకంగా టీడీపీకి ఇది బలమైన దెబ్బ. ఇప్పటికే కాపు సామాజిక వర్గంలో సరిపడా అసంతృప్తిని మూటగట్టుకున్న టీడీపీ.. ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ నుంచి వ్యతిరేకత ఎదుర్కోవడం.. ఇక ఆ సామాజిక వర్గంలో పార్టీని మరింత ఢీలా పడేసే అంశం.
ఏవిధంగా చూసుకున్న పవన్ చట్టసభల ఎంట్రీ.. టీడీపీకి నష్టం చేకూర్చేది గానే కనిపిస్తోంది. మరి నిన్నటిదాకా మిత్రుడిగా కొనసాగిన పవన్ లాంటి మిత్రున్ని.. ఇకనుంచి శత్రువుగా టీడీపీ ఎలా ఎదుర్కోబోతుంది? అన్న అంశం ప్రస్తుతం ఏపీ ప్రజానీకంలో ఉత్కంఠను రేకెత్తిస్తోన్న అంశం.