ప్రజలనుండి 70 ఫోటోలు, బాబుకు కేసీఆర్ స్నేహహస్తం
హైదరాబాద్/విశాఖపట్నం: హుధుద్ తుఫాను బీభత్సానికి సంబంధించి ఎవరికి వారు ఫోటోలు తీసి ప్రభుత్వం చెప్పిన వెబ్సైట్కు అప్లోడ్ చేస్తే వాటి ఆదారంగా సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
చంద్రబాబు పిలుపు మేరకు చాలామంది ఫోటోలు తీసి పంపించే ప్రయత్నం చేశారు. అయితే, దెబ్బతిన్న కమ్యూనికేషన్ల వ్యవస్థ, తుఫాను ప్రభావిత జిల్లాల్లో విద్యుత్తు లేకపోవడం సమస్యగా మారింది. ఫలితంగా ప్రజల నుండి మంచి స్పందన వచ్చినప్పటికీ.. ఫోటోల సంఖ్య తొలి రోజు కేవలం 70 మాత్రమే వచ్చాయి.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విద్యుత్తుతో పాటు, మొత్తం కమ్యూనికేషన్ల వ్యవస్థ కుప్పకూలడంతో కనీసం ఫోన్లలో కూడా మాట్లాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆయినప్పటికీ కొందరు తుఫాను విధ్వంసం ఫోటోలను తీసి ప్రకృతి వైపరీత్య నిర్వహణ సంస్థ, ముఖ్యమంత్రి ఫేస్బుక్కు పంపించారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకు కూడా పంపించారు.
రాష్ట్ర ప్రభుత్వం తమ పరిధిలోకి వచ్చిన ఫోటోలను జియోటాగింగ్లో జతచేసి నష్టం అంచనాకు ఉపయోగించుకుంటోంది. విద్యుత్తు, కమ్యూనికేషన్ల వ్యవస్థ పునరుద్ధరణకు అయిన తర్వాత ప్రజల నుండి ఫోటోలు వెల్లువెత్తే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. కాగా, హుధుద్ దుభాను కారణంగా చనిపోయిన వారి సంఖ్య 22కు చేరుకుంది.
తెలంగాణ స్నేహహస్తం
ఏపీలో హుధుద్ తుఫాను సహాయక చర్యలలో పాల్గొనేందుకు ఐదుగురు ఏఐఎస్ల అధికారులను డిప్యూటేషన్ పైన నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పని చేస్తున్న నీరబ్ కుమార్ కుమార్ ప్రసాద్, శ్రీనివాస్ శ్రీ నరేష్, గిరిజాశంకర్, హరిజవహర్లాల్, లక్ష్మీకాంతంను వెంటనే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద రిపోర్టు చేయాలని సూచించింది.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ ప్రభుత్వ తీసుకునే పునరావాస, సహాయక చర్యలకు సహకరించాలని, విపత్తు నిర్వహణ కమిషనర్తో సమన్వయంతో వ్యవహరించాలని సూచించింది. ఏపీ ప్రభుత్వానికి అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించిన విషయం తెలిసిందే.
రోడ్డుమార్గంలో అశోక్
తుఫను ప్రభావిత ప్రాంతాల్లో సందర్శించేందుకు వచ్చి కేంద్రమంత్రి అశోక గజపతి రాజు సోమవారం భువనేశ్వర్ వచ్చారు. ఇక్కడి నుండి రోడ్డు మార్గంలో ఆయన విశాఖకు వచ్చారు. మరోవైపు, చంద్రబాబు విశాఖపట్నంలో సోమవారం ఉదయం నుండి విస్తృతంగా పర్యటించి హుధుద్ విలయం నష్టాన్నికళ్లారా చూసి.. బాధితులతో నేరుగా మాట్లాడి క్షేత్రస్థాయి ప్రజలు ఎదుర్కొన్న ఇక్కట్లు తెలుసుకున్నారు. బాధితులకు సహకారం అందక పోవడంలో వైమానిక దళం బాధ్యత ఉందని గుర్తించినట్లుగా తెలుస్తోంది.