వంద కోట్ల బెట్టింగ్.. కోటిన్నర గెలుచుకున్న టీడీపీ నేత: కడప ఎమ్మెల్సీపై ఆది సంచలనం
బెట్టింగ్ లో ఓ టీడీపీ నేత సైతం కోటిన్నర రూపాయలు గెలుచుకున్నారని ఎమ్మెల్యే ఆది పేర్కొనడం గమనార్హం.
కడప: స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ కంచుకోట కడపలో టీడీపీ పాగా వేసిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కడప జిల్లాలో టీడీపీ నెగ్గడం ఇదే తొలిసారి. అయితే ప్రతిపక్షానికి పూర్తి పట్టున్న జిల్లాలో అధికార పక్షం తన సత్తా చాటేందుకు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఈ సంగతెలా ఉన్నా.. పార్టీల గెలుపోటములపై మాత్రం భారీగానే బెట్టింగ్ జరిగింది. ఇదే విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తాజాగా స్పష్టం చేశారు. శనివారం నాడు అసెంబ్లీ లాబీలో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్సీ ఎన్నికలపై జిల్లాలో రూ.100కోట్ల బెట్టింగ్ జరిగిందన్నారు.
తన సొంత ఊరు దేవనగుడిలోనే కోటిన్నర వరకు బెట్టింగ్ జరిగిందని ఆది నారాయణరెడ్డి చెప్పుకొచ్చారు. అంతేకాదు, బెట్టింగ్ లో ఓ టీడీపీ నేత సైతం కోటిన్నర రూపాయలు గెలుచుకున్నారని ఆది పేర్కొనడం గమనార్హం. కాగా, కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 34ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిపై టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 839 ఓట్లు పోల్ కాగా టీడీపీకి 433 ఓట్లు.. వైఎస్ వివేకాకు 399 ఓట్లు వచ్చాయి. ఇందులో ఏడు ఓట్లు చెల్లలేదు.