విడివిడిగా దంపతులు: భార్యపై భర్త యాసిడ్ దాడి
తిరుపతి: చిత్తూరు జిల్లాలోని తిరుపతి రూరల్ మండలం కాలూర్ క్రాస్లో దారుణ సంఘటన జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త యాసిడ్తో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. పీలేరులోని ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న జరీనాబేగం తన భర్త ఖాజావలితో ఏర్పడిన మనస్పర్థల కారణంగా మూడేళ్లుగా విడిగా ఉంటోంది.
ఖాజావలి తరచూ భార్యను ఉద్యోగం మానేయాలని ఒత్తిడి చేసేవాడు. గతంలో ఈ విషయంలో గొడవ పడి కత్తితో దాడి చేసి జరీనాను గాయపరిచాడు. అతడిపై కేసు కూడా నమోదయింది. ఈ నేపథ్యంలోనే కాలూరు క్రాస్ రోడ్ మీదుగా ఇంటికి వెళ్తున్న జరీనాపై ఖాజావలి యాసిడితో ఆమెపై దాడి చేశాడు.
ఈ దాడిలో జరీనా తలకు, ముఖానికి గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జరీనా బేగం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
భార్య ఉద్యోగం మానేయకపోవడంతో ఖాజావలి కక్ష పెంచుకుని ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఆమె రెండు కళ్లకు ప్రమాదం ఉన్నట్లు సమాచారం.
వ్యక్తి దారుణ హత్య
ప్రకాశం జిల్లా చీరాల మండలంలోని కొత్తపాలెం దగ్గర ఘోరమైన హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడిని హత్య చేసి నోటికి ప్లాస్టర్ వేసి కాలువలో పడేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.