పాలకొల్లు కోర్టు ప్రాంగణంలో భార్యను గొడ్డలితో నరికిన భర్త
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కోర్టు ప్రాంగణంలో బుధవారం నాడు దారుణం జరిగింది. విడాకుల కోసం కోర్టుకెక్కిన భార్య పైన భర్త గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడిచేసిన భర్త పరారీలో ఉన్నాడని తెలుస్తోంది.
భార్యాభర్తలు మనస్పర్థల కారణంగా కొద్ది రోజుల క్రితం విడిపోయారు. విడాకుల కోసం మూడు నెలల క్రితం వారు దరఖాస్తు చేసుకున్నారు. తనకు తన భర్త మనోవర్తి ఇవ్వాలని, ఆస్తిలో భాగం ఇవ్వాలని భార్య కోర్టుకు ఎక్కింది. బుధవారం కోర్టు వాయిదా ఉంది. ఈ సమయంలో భర్త.. భార్య పైన గొడ్డలితో దాడి చేశాడు.
నిందితుడి పేరు సత్యనారాయణ రాజు. అతని వయస్సు 42 ఏళ్లు. బాధితురాలి పేరు వసుంధర. ఆమె వయస్సు 38. ఈ వారి వివాహం పదిహేనేళ్ల క్రితం వివాహం జరిగింది.
పాఠశాల బస్సుకు తప్పిన ప్రమాదం
విశాఖ జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురంలోని స్ప్రింగ్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఉదయం విద్యార్థులను పాఠశాలకు తీసుకువెళ్తుండగా మద్ది గ్రామం సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో పాఠశాల బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.
రోడ్డు తక్కువ వెడల్పు ఉండడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది విద్యార్థులు ఉన్నారు.