బెజవాడలో సంచలనం: పెళ్ళైందని ప్రశ్నిస్తే నా భార్య వేధిస్తోంది, కోర్టును ఆశ్రయించిన భర్త
విజయవాడ: తన భార్య వేధిస్తోందని గోగు రామ్కుమార్ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొదట పెళ్ళి చేసుకొన్న విషయాన్ని దాచి పెట్టి తన భార్య తనను వివాహం చేసుకొందని రామ్కుమార్ ఆరోపిస్తున్నారు. అయితే పిటిషన్ను కోర్టు స్వీకరించింది.
సాధారణంగా భార్యలను భర్తలు వేధిస్తున్నారని కోర్టుల్లో కేసులు దాఖలు కావడం చూస్తున్నాం. గృహ హింస కేసు కింద పలు కేసులు నమోదౌతుంటాయి.ఈ కేసుల్లో భర్తలు హింసిస్తున్నారని భాదితులు చెబుతుంటారు.
అంతేకాదు భర్తల బాధలను భరించలేక విడిపోయేందుకు గాను పరిహరాన్ని కూడ కోరుతుంటారు. కానీ, దానికి భిన్నంగా విజయవాడలో రమణకుమార్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన భార్య తనను వేధింపులకు గురి చేస్తోందని ఆయన ఆరోపించారు.
భార్య వేధిస్తోందని కోర్టును ఆశ్రయించిన భర్త
తన భార్య వేధిస్తోందని గోగు రమణకుమార్ అనే వ్యక్తి విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. విజయవాడ మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించడంతోనే తమ క్లయింట్ విజయం సాధించినట్టైందని రమణ కుమార్ తరపు న్యాయవాది అభిప్రాయపడుతున్నారు.
వివాహమైన విషయం దాచింది
గత ఏడాది ఆగష్టు 11వ, తేదిన ఓ యువతితో రమణకుమార్ కు వివాహమైంది. అయితే ఆమెకు అంతకుముందే వివాహమైందని, పిల్లలు కూడ ఉన్నారని రమణకుమార్ ఆరోపిస్తున్నాడు. ఈ విషయాన్ని దాచిపెట్టి తనను వివాహం చేసుకొందని రమణకుమార్ ఆ పిటిషన్లో పేర్కొన్నాడు. వివాహమైన రెండు మాసాలకు తనకు ఈ విషయాలు తెలిసినట్టు రమణ కుమార్ చెప్పారు.
ప్రశ్నిస్తే చిత్రహింసలు
తన భార్యకు వివాహమై పిల్లలున్నారనే విషయాన్ని ప్రశ్నిస్తే తనను చిత్రహింసలకు గురి చేస్తోందని రమణకుమార్ ఆ పిటిషన్ లో ఆరోపించారు.తనపై 498(ఎ) సెక్షన్ కింద కేసుపెట్టి రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని రమణ కుమార్ ఆరోపించారు. తన భార్య కోరుతున్న డబ్బును ఇచ్చుకొనే స్థోమత తనకు లేదని అందుకే కోర్టును ఆశ్రయించినట్టు రమణకుమార్ చెప్పారు.
జనవరి 21న, విచారణ
జనవరి 21న, ఈ కేసు విషయమై విచారణ చేపట్టనున్నట్టు కోర్టు ప్రకటించింది. భార్య హింసిస్తోందని ఓ భర్త కోర్టును ఆశ్రయించడం బహుశా ఏపీ చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చు. కోర్టు కూడ ఈ పిటిషన్ స్వీకరించడం గమనార్హం.