వివేకా కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు తొలి అడుగు- ఫిబ్రవరి 10న రావాలని వారందరికీ సమన్లు..!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సుప్రీంకోర్టు హైదరాబాద్ కు బదిలీ చేసిన తర్వాత తొలిసారిగా సీబీఐ కోర్టు విచారణ ప్రారంభించబోతోంది. ఫిబ్రవరి 10న జరిగే విచారణకు రావాలని నిందితులకు సమన్లు పంపింది.
ఏపీలో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు ఓవైపు కొనసాగుతండగానే, మరోవైపు హైదరాబాద్ సీబీఐ కోర్టు విచారణ ప్రారంభించేందుకు రంగం సిద్దం చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ సీబీఐ కోర్టుకు మారిన ఈ కేసులో విచారణ ప్రారంభించేందుకు వీలుగా కోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది.
వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ ప్రక్రియ ప్రారంభించిన సీబీఐ కోర్టు.. ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన, అనుబంధ ఛార్జ్ షీట్ ను విచారణకు స్వీకరించింది. అలాగే
వైఎస్ వివేకా హత్య కేసుకు SC/01/2023 నంబరు కేటాయించింది. వైఎస్ వివేకా హత్య కేసులో ఐదుగురు నిందితులకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. సీబీఐ కోర్టు నుంచి సమన్లు అందుకున్న నిందతుల్లో ఎర్ర గంగిరెడ్డి, వై.సునీల్ యాదవ్, జి.ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరి, డి.శివశంకర్ రెడ్డి ఉన్నారు.

హైదారాబాద్ సీబీఐ కోర్టు నుంచి సమన్లు అందుకున్న ఐదుగురు నిందితులు .. ఫిబ్రవరి 10న విచారణకు హాజరు కావాలని సీబీఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఫిబ్రవరి 10న తొలిసారి విచారణ ప్రారంభించేందుకు సీబీఐ కోర్టు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల కడప నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయిన తర్వాత ఈ కేసు విచారణ ఇదే తొలిసారి. మరోవైపు ఇవాళ హైదరాబాద్ లో సీబీఐ అధికారుల ముందు విచారణకు ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరవుతున్నారు. సీబీఐ కోర్టు విచారణ ప్రారంభించేలోపు కీలక సాక్ష్యాలు ప్రవేశపెట్టేందుకు సీబీఐ సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications