ముచ్చెర్లలో 'హైదరాబాద్ ఫార్మా సిటీ', రూ.30వేల కోట్ల పెట్టుబడులు: కేసీఆర్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో 11 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం చెప్పారు. ఫార్మా, ఫిలిం తదితర సిటీల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా కేసీఆర్ పలువురు మంత్రులు, అధికారులతో కలిసి నాలుగు హెలికాప్టర్లలో ఏరియల్ సర్వే నిర్వహించారు. సాయంత్రం ఏరియల్ ముగిసింది. కేసీఆర్తో పాటు మంత్రి మహేందర్ రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డిలు ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు.
అలాగే, పది ఫార్మా కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. వారిలో రెడ్డీ ల్యాబ్స్, హెటిరో, అరబిందో ఫార్మా ప్రతినిధులు ఉన్నారు. ముచ్చెర్లలో పార్మా సిటీకి అనుకూలంగా ఉందని నిర్ణయానికి వచ్చారు. పారిశ్రామికవేత్తలు అక్కడ కంపెనీల స్థాపనకు సానుకూలత వ్యక్తం చేశారు. కంపెనీలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు.
11వేల ఎకరాల్లో ఫార్మా సిటీని నిర్మిస్తామని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. ఫార్మా కంపెనీలతో పాటు, ఆ కంపెనీలో పని చేసే ఉద్యోగులకు టౌన్ షిప్లు నిర్మిస్తామని చెప్పారు. కాలుష్యం లేకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఫార్మా సిటీ ఉంటుందని చెప్పారు.
స్థానిక కంపెనీలే రూ.30వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఫార్మా సిటీతో 70వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ముచ్చెర్లలో 11వేల ఎకరాల్లో ఫార్మా సిటీలో ఫార్మా విశ్వవిద్యాలయం, ఫార్మా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నిర్మిస్తామని తెలిపారు.
అంతర్జాతీయ స్థాయిలో ఎకో ఫ్రెండ్లీ ఫార్మా సిటీ నిర్మిస్తామన్నారు. దీనికి హైదరాబాద్ ఫార్మా సిటీ అని పేరు పెట్టనున్నట్లు చెప్పారు. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వ్యవస్థతో ఫార్మా సిటీ పని చేస్తుందన్నారు. ఫార్మా సిటీ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవాలని, పనులు వేగవంతం చేయాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.
కేంద్రీయ విశ్వవిద్యాలయాలపై కేసీఆర్...
తెలంగాణకు మంజూరైన కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో వచ్చే ఏడాది నుండి బోధన జరిగేలా చూడాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి, వరంగల్ జిల్లా మహబూబ్ నగర్, అదిలాబాద్ జిల్లా మంచిర్యాల, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, మెదక్ జిల్లా జరాసంగం, నిజామాబాద్ జిల్లా బోధన్లలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు మంజూరయ్యాయి. విశ్వవిద్యాలయాల స్థాపనకు అవసరమైన స్థలాలు అప్పగించి, ఇతర పనులు చూడాలని ఆదేశించారు.