హైదరాబాద్ టు అమరావతి, 16వ తేదీ నుంచి ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు, క్వారంటైన్ కంపల్సరీ..
ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని స్వస్థలం తీసుకొచ్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది. తొలుత హైదరాబాద నుంచి ఏపీ వాసులను తీసుకెళ్లనుంది. ఈ నెల 16వ తేదీ నుంచి బస్సులను నడుపుతామని ఆర్టీసీ పేర్కొన్నది. అయితే ఏపీ వచ్చాక క్వారంటైన్లో ఉంటామని ఒప్పుకుంటేనే తీసుకెళతాని షరతు విధించింది. హైదరాబాద్లోని ఎల్బీనగర్, మియాపూర్-బొల్లారం క్రాస్ రోడ్, కూకట్ పల్లి నుంచి బస్సులను నడపనుంది.
బస్సులలో ఫిజికల్ డిస్టన్స్ పాటిస్తూ.. 50 శాతం ప్రయాణికులతోనే నడుపుతాని చెప్పింది. తర్వాత బెంగళూరు, చెన్నైలలో ఉన్నవారిని కూడా రాష్ట్రానికి తీసుకొస్తామని తెలిపింది. ఇతర రాష్ట్రాలకు చెందినవారే కాదు.. సొంత రాష్ట్రంలో కూడా ఈ నెల 18వ తేదీ నుంచి బస్సులను నడిపిస్తామని ఆర్టీసీ ఎండీ ప్రతాప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన రీజనల్ మేనేజర్లకు ఆదేశాలు కూడా జారీచేశారు. లాక్ డౌన్ వల్ల మార్చి 22 నుంచి బస్సులు డిపోలకే పరిమితమైన సంగతి తెలిసిందే.
అమరావతి, గరుడ, గరుడ ప్లస్, వెన్నెల స్లీపర్, నైట్ రైడర్, ఇంద్ర, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో 50% ప్రయాణికులను అనుమతిస్తామని స్పష్టంచేశారు. దూర ప్రాంత బస్సుల్లో టికెట్లను ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలని సూచించారు. ఒకవేళ ఆయా బస్సుల్లో సీట్లు ఉంటే.. బస్టాండ్లో కండక్టర్లకు ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా చార్జీ చెల్లించే వెసులుబాటు కల్పిస్తామని పేర్కొన్నారు.