ఐఎస్ఐఎస్: కోల్కతాలో హైదరాబాదీ యువకుల అరెస్ట్
కోల్కతా/హైదరాబాద్: ఇరాక్లోని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్లో చేరేందుకు సిద్ధమైన హైదరాబాద్ నగరానికి చెందిన నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులను పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరాక్ వెళ్లేందుకు బయలుదేరిన నలుగురు యువకులను బంగ్లాదేశ్ సరిహద్దులో పోలీసులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.
అయితే వారి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఇంటర్నెట్లో ఐఎస్ఐఎస్ ప్రచారానికి విద్యార్థులు ఆకర్షితులైనట్లు తెలుస్తోంది. గతంలోనూ ఈ నలుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం విడుదల చేశారు.
నలుగురు హైదరాబాద్ యువకులను అరెస్ట్ చేసిన విషయాన్ని హైదరాబాద్ పోలీసులకు బెంగాల్ పోలీసులు తెలియజేసినట్లు తెలిసింది. ఆ యువకులు ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్తో కలిసి పనిచేస్తామని చెప్పినట్లు సమాచారం. ఐఎస్ఐఎస్లో కల్లలో ప్రాంతమైన సౌత్ సిరియా, ఇరాక్ ప్రాంతాల్లో పని చేస్తామంటున్న యువకులు.. అక్కడికే బయలుదేరినట్లు చెప్పినట్లు తెలిసింది.
భారతదేశంలో మరో ఉగ్రవాద సంస్థ ఆల్ఖైదా తన శాఖను ప్రారంభిస్తామని ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన నెలకొడంతో పోలీసులు అప్రమత్తయ్యారు. ఈ నలుగురు యువకులతో పాటు మరికొందరు యువకులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారందరూ ఐఎస్ఐఎస్లో శిక్షణ పొందేందుకు వెళుతున్నారా? లేక ఇక్కడే విధ్వంసానికి ప్రణాళికలు వేస్తున్నారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.
సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద సంస్థలకు ఆకర్షితులైన ముంబైకి చెందిన నలుగురు యువకులు ఇప్పటికే ఐఎస్ఐఎస్లో చేరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నిఘా పెట్టిన పోలీసులు, తమకు అందిన సమాచారంతోనే హైదరాబాద్కు చెందిన నలుగురు యువకులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు సమాచారం.