ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు ప్రత్యక్ష బాధితుడిని: ఏపీ మాజీ ఐఎఎస్
Land titling Act: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు కౌంట్ డౌన్ ఆరంభమైంది.. గడువు సమీపించింది. ఎన్నికలకు ఎంతో సమయం లేదు. ఇంకో వారం రోజులు మాత్రమే వ్యవధి ఉంది. ఈ నెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.
ఈ ఎన్నికల్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంశం దుమారం రేపుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే దీన్ని అమలు చేస్తుందంటూ ఆరోపిస్తోంది తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి. తాము దీన్ని రద్దు చేస్తామనీ చెబుతోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తాను పెట్టబోయే రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు ప్రతిపాదనల మీదేనంటూ చంద్రబాబు నాయుడు హామీ సైతం ఇచ్చారు.

దీనిపై వైఎస్ఆర్సీపీ ఎదురుదాడికి దిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సహా పలువురు మంత్రులు స్పందించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని వివరించారు.
అదే బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఎన్డీఏ కూటమిలో చేరిన టీడీపీ గనక రాష్ట్రంలో అధికారంలోకి వస్తే దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. గతంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. అద్భుతమైనదిగా అభివర్ణిస్తూ టీడీపీ ఎమ్మెల్యే పయ్యవుల కేశవ్ నిండు అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు తెరమీదికి తీసుకొచ్చారు.
ఈ పరిణామాల మధ్య ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ చేసిన ఓ పోస్ట్.. సంచలనంగా మారింది. ఈ యాక్ట్ను తాను ప్రత్యక్ష బాధితుడినంటూ ఆయన చెప్పారు. దీనివల్ల తన సొంత భూమిపై తాను హక్కులను పొందలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లా విన్నకోటలో తన తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేయించడానికి రెవెన్యూ అధికారులు నిరాకరించారని పీవీ రమేష్ తెలిపారు. మ్యుటేషన్ కోసం తాను దాఖలు చేసుకున్న దరఖాస్తును తహశీల్దార్ తిరస్కరించారని చెప్పారు. ఆర్డీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తనకు తిరిగి ఇచ్చేశారని అన్నారు.
తన తల్లిదండ్రుల భూములపై తనకు హక్కు లేకుండా చేస్తోన్నారని పేర్కొన్నారు. ఒక ఐఎఎస్ అధికారిగా 36 సంవత్సరాల పాటు సేవలను అందించిన తన పరిస్థితే ఇలా ఉంటే, ఇక సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేమంటూ పీవీ రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications