నవ్యాంధ్రకు నేనున్నా.. డోంట్ వర్రీ.. బాబుతో మాట్లాడతా: టీడీపీ ఎంపీలకు ప్రధాని భరోసా!
Recommended Video
న్యూఢిల్లీ: 'అయామ్ ఫర్ ఆంధ్రా.. డోంట్ వర్రీ'.. విభజన సమస్యలపై తనను కలిసిన టీడీపీ ఎంపీలకు ప్రధాని మోడీ ఇచ్చిన భరోసా ఇది. శుక్రవారం ప్రధానిని కలిసిన టీడీపీ ఎంపీలు రాష్ట్రంలోని సమస్యలు, విభజన హామీల్లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలుకాని వైనాన్ని వివరించి, ఒక వినతి పత్రాన్ని కూడా ఆయనకు అందించారు.
టీడీపీ ఎంపీల విన్నపానికి స్పందించిన మోడీ.. ఏపీకి తాను అన్ని విధాలుగా అండగా ఉంటానంటూ వారికి భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా తన అపాయింట్మెంట్ అడిగారని, రెండు మూడు రోజుల్లో ఆయనతో మాట్లాడతానని చెప్పారు. ఆందోళన వద్దని, ఆంధ్రప్రదేశ్కు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని స్పష్టం చేశారు.
ప్రధానిని కలిసిన ఎంపీ ఎంపీలు...
శుక్రవారం తెలుగుదేశం ఎంపీలు ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిశారు. రాష్ట్ర సమస్యలను ఏకరవు పెట్టారు. ‘‘కేంద్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు దాటిపోయింది. ఇప్పటికీ విభజన చట్టం కింద ఇచ్చిన అనేక హామీలు నెరవేరలేదు. దీనివల్ల రాష్ట్రం తీవ్ర కష్టాలు ఎదుర్కొంటోంది'' అని తెలిపారు. మరో ఏడాదిన్నరలోపే ఎన్నికలు వస్తున్నాయని గుర్తు చేశారు.
పలు సమస్యలపై విన్నపం...
రాష్ట్ర విభజన జరిగినప్పట్నించి ఇప్పటి వరకు చాలా సమస్యలు తీరలేదని, ప్రత్యేక సహాయం, రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన, రైల్వేజోన్తో సహా విభజన చట్టంలో పేర్కొన్న అనేక హామీలు నెరవేర్చలేదని వారు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ప్రత్యేక సహాయం కింద రాష్ట్రానికి 20,010 కోట్లు రావాల్సి ఉందన్నారు. నియోజకవర్గాల పెంపుపైనా నిర్ణయం తీసుకోలేదని గుర్తు చేశారు.
ఇలాగైతే ప్రజల్లోకి వెళ్లేదెలా?
ఈ సందర్భంగా తెలుగుదేశం ఎంపీలు ‘‘ఇలాంటి పరిస్థితుల్లో మేం ప్రజల్లోకి వెళ్లేదెలా? సమస్యలను పరిష్కరించేందుకు ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయండి..'' అని ప్రధాని మోడీని కోరారు. ఆయా అంశాలతో ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారు ఒక వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రం అందుకున్న ప్రధాని సమస్యలన్నీ తప్పక పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.
ఐయామ్ ఫర్ ఆంధ్రా... డోంట్వర్రీ...
ఎంపీలు చెప్పిన అంశాలను సావధానంగా విన్న ప్రధాని చిరునవ్వు నవ్వుతూ ‘‘ఐ యామ్ ఫర్ ఆంధ్ర.. డోన్ట్ వర్రీ'' (నేను ఆంధ్రప్రదేశ్కు అండగా ఉంటాను. ఆందోళన వద్దు) అని జవాబిచ్చారు. ఆ తర్వాత కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి, రాజ్యసభలో డిప్యూటీ నేత సీఎం రమేశ్ ప్రత్యేకంగా ప్రధానితో చర్చించారు. శుక్రవారం తాము కోరిన వెంటనే ప్రధాని అప్పాయింట్మెంట్ ఇచ్చారని టీడీపీ ఎంపీలు తెలిపారు. టీడీపీ ఎంపీలతోపాటు బీజేపీ ఎంపీ హరిబాబు కూడా ప్రధానిని కలిశారు.