కరోనా రెండో దశ పట్ల జాగ్రత్త: తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ ఏపీ, తెలంగాణపై పవన్ కళ్యాణ్
హైదరాబాద్/అమరావతి: ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని, తన గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. తన ఆరోగ్యంగా కుదుటపడుతోందని, తాను క్షేమంగా ఉండాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ పేరిట జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది.
కరోనా రెండో దశ పట్ల జాగ్రత్తంటూ పవన్ కళ్యాణ్
కరోనా రెండో దశ వ్యాప్తి తీవ్రంగా ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ప్రజలకు సూచించారు. అధికారిక లెక్కల ప్రకారం ఏఏపీలో 7వేలు.. తెలంగాణలో 4వేలకుపై కరోనా కేసులు నమోదవుతున్నాయి. కానీ, అంతకు కొన్ని రెట్లు కేసులున్నాయని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు మరింత సన్నద్ధతో వ్యవవహరించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
ఏపీలో పరిస్థితి ఆందోళనకరంగానే..
ఏపీలో కరోనా బారినపడిన వారికి అవసరమైన మేరకు బెడ్స్, అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. పరిస్థితిని ముందు అంచనా వేసి వాటిని ఏర్పాటు చేయకపోవడం వల్లే ఆందోళనకర స్థితి నెలకొందన్నారు. ఆస్పత్రుల్లో బెడ్స్ లేవని రోగులను చేర్చుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు. రోగులకు అవసరమైన మందుల కొరత కూడా ఏర్పడిందని.. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యవసర కరోనా కేంద్రాలను భారీగా తెరిచి వైద్య పరీక్షల సంఖ్యను పెంచడంతోపాటు వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలు చేపట్టాలన్నారు. కరోనా నిరోధంలో ప్రభుత్వాల చర్యలు ఎలా ఉన్నా ప్రజలు తమవంతు బాధ్యతగా స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
వీలైనంత త్వరగా ప్రజల ముందుకు వస్తానంటూ పవన్ కళ్యాణ్
ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడుతోందని, వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. వీలైనంత త్వరగా కోలుకుని ప్రజల ముందుకు వస్తానని చెప్పారు. తాను కరోనా బారినపడ్డానని తెలిసినప్పటి నుంచి తన యోగక్షేమాల గురించి ఆందోళన చెందుతూ సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ని కావాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. రాజకీయ, సినీ, సామాజిక ప్రముఖులు, మీడియా ప్రతినిధులు తాను క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారన్నారు. సందేశాలు కూడా పంపించారని తెలిపారు. వాందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్. జన సైనికులు, అభిమానులు తాను కోలుకోవాలని పూజలు, హోమాలు, ప్రార్థనలు చేశారని, వారందరికీ ధన్యవాదాలు లాంటి పదాలతో తన భావోద్వేగాన్ని తెలపలేని చెప్పారు. సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే మీ కోసం ముందుకు వచ్చి నిలడతానని పవన్ కళ్యాణ్ తెలిపారు.