ఫ్యామిలీతో విదేశీ పర్యటనకు వెళ్లా, తప్పుడు కేసులకు భయపడను: త్వరలోనే వస్తానంటూ పట్టాభి
అమరావతి: తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి వ్యాఖ్యలు, ఆ తర్వాత ఆయన ఇంటిపై, టీడీపీ ఆఫీసులపై దాడులు, ఆఖరుకు ఆయన అరెస్టు, విడుదల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బెయిల్పై విడుదలైన పట్టాభి.. విమానంలో కనిపించడంతో రకరకాల ఊహాగానాలు, వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పట్టాభి తన పర్యటనపై క్లారిటీ ఇచ్చారు.
కుటుంబంతో కలిసి తాను బయటకు వచ్చానని, త్వరలోనే తన విధి తాను చేస్తానని పట్టాభి తెలిపారు. తప్పుడు కేసులకు భయపడను అని స్పష్టం చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జైలుకెళ్లిన అనంతరం ఆయన బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే.
శనివారం సాయంత్రం రాజమండ్రి జైలు నుంచి విడుదలైన అనంతరం హనుమానం జంక్షన్ ల ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విజయవాడకు బయల్దేరారు పట్టాభి. ఆ తర్వాత ఇంటికి చేరుకోకపోవడంతో కలకలం రేగింది. ఆయన్ను మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారని వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి.
ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయలేదని, కుటుంబంతో కలిసి విదేశీ యాత్రకు వెళ్లినట్లు కూడా ప్రచారం జరిగింది. అదే సమయంలో పట్టాభి విమానంలో కూర్చున్న ఫొటోలు, విమానాశ్రయంలో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హైదరాబాద్ నుంచి మాల్దీవులకు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. మరికొందరు పట్టాభి దేశం వదిలి పారిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.
Recommended Video
ఇలాంటి అనేక ప్రచారాలు, ఊహాగానాలకు పట్టాభి తాజాగా వీడియో సందేశంతో తెరదించారు. భార్యతో బయటకు వెళితే అనేక అనార్థాలు తీస్తున్నారని అన్నారు. తన కుటుంబంతో కలిసి బయటకు వచ్చినట్లు తెలిపిన ఆయన.. అతి త్వరలో మళ్లీ వచ్చి తన విధి తాను చేస్తానని వీడియోలో వెల్లడించారు. తప్పుడు కేసులకు భయపడనని, తనింటిపై వైసీపీ నేతలు జరిపిన దాడిలో తన కుమార్తె భయభ్రాంతులకు గురైందని తెలిపారు. ఒక తండ్రిగా తన కుమార్తెకు బాధ్యత వహిస్తానని, తనపై పెట్టిన తప్పుడు కేసులకు కోర్టులను ఆశ్రయిస్తానని పట్టాభి ఆ వీడియోలో పేర్కొన్నారు.