విభజనపై కన్విన్స్ కాలేదు: డిగ్గీకి కిరణ్ రెడ్డి కౌంటర్
న్యూఢిల్లీ: తాను రాష్ట్ర విభజన విషయంలో కన్విన్స్ కాలేదని, దిగ్విజయ్ సింగ్ వెర్షన్ కావచ్చునేమో తెలియదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో తన వైఖరి మారలేదని ఆయన చెప్పారు. మొదటి నుంచి తాను సమైక్యవాదాన్నే వినిపిస్తున్నానని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే మేలు జరుగుతుందని నమ్ముతున్నానని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో ఆయన శనివారం మీడియా ప్రతినిధుల మాట్లాడారు.
విభజన సున్నితమైన సమస్య అని, దానిపై ఇప్పుడు మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. సమైక్యవాదాన్ని వినిపించడం ద్వారా ప్రత్యేక రాష్ట్రం కావాలనే తెలంగాణ ప్రజల ఆకాంక్షను తాను కించపరచడం లేదని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర కన్నా తెలంగాణకు ఎక్కువ నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. ఆలోచించుకోవాలని తాను కోరుతున్నానని ఆయన అన్నారు.

రాష్ట్రాన్ని విభజిస్తే చాలా సమస్యలు వస్తాయని, ఆ సమస్యలేమిటో ముందు ముందు మీ ముందుకు వస్తాయని ఆయన అన్నారు. ఉద్యమం జరుగుతున్న సమయంలో మాట్లాడితే కించపరిచినట్లు అవుతుందని మాట్లాడలేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాను ఇప్పటికీ వ్యతిరేకం కాదని, అయితే పరిష్కారం కాని సమస్యలు చాలా ఉన్నాయని, ఆ సమస్యలు పరిష్కారమైన తర్వాతనే రాష్ట్రాన్ని విభజించాలని ఆయన అన్నారు.
ప్రాజెక్టుల విషయంలో సమస్యలు వస్తాయని ఆయన చెప్పారు. రెండు ప్రాంతాల్లోని నదులను విభజించే పరిస్థితే లేదని ఆయన అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. వరదలు వస్తే పెద్ద యెత్తున నష్టం వస్తుందని, దాని వల్ల విపరీతమైన ప్రాణ నష్టం సంభవిస్తుందని, సమన్యం సాధ్యం కాదని ఆయన అన్నారు. ఉద్యోగుల సమస్య ఉందని, వైద్య సదుపాయాల సమస్యలున్నాయని ఆయన అన్నారు. అన్ని సమస్యలను పరిష్కరించిన తర్వాత రాష్ట్ర విభజనపై ఆలోచన చేయాలని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు.
వరద సాయానికి పిఎం హామీ
తుఫాను, వర్షం తాకిడి ప్రాంతాలకు తక్షణ సాయంగా వేయి కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ప్రధాని మన్మోహన్ సింగ్ అంగీకరించినట్లు ఆయన తెలిపారు. తుఫాను, వర్షం కారణంగా రాష్ట్రంలోని 16 జిల్లాల్లో నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు. మొత్తం 58 మంది మరణించినట్లు ఆయన తెలిపారు. 13 నుంచి 14 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆయన చెప్పారు.
వరద, తుఫాను తాకిడి ప్రాంతాల్లో సహాయానికి 6,510 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ప్రధానిని కోరినట్లు ఆయన తెలిపారు. కేంద్ర బృందం పరిశీలించిన తర్వాత మరింత సాయం అందిస్తామని ప్రధాని చెప్పినట్లు ఆయన తెలిపారు. 2009 తుఫాను, కరువు వల్ల జరిగిన నష్టానికి ఉన్నత స్థాయి కమిటీ మంజూరు చేసిన 1,145 కోట్ల రూపాయలను విడుదల చేయించడానికి ఆదేశాలు జారీ చేస్తానని ప్రధాని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
ప్రధానితో భేటీ..
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు నాయకులు శుక్రవారం ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్ను కలిశారు. ప్రధానిని కలిసినవారిలో కేంద్ర మంత్రులు చిరంజీవిస, పళ్లం రాజు, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, దిగ్విజయ్ సింగ్లతో పాటు రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, శైలజానాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానితో బేటీ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications