ప్రధానమంత్రి పదవిపై ఆశలేదు, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టా: వెంకయ్య
విజయవాడ: ప్రధానమంత్రి పదవిని చేపట్టాలనే ఆశ లేదని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు.అయితే ప్రధానమంత్రి అయ్యే అర్హత తనకు లేదని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్టు కార్యాలయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం నాడు మీడియాతో చిట్ చాట్ చేశారు.
దేశ రాజకీయాలతో పాటు ఇతర అంశాలపై వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు.పార్టీ ఫిరాయింపుల విషయమై కూడ వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధానమంత్రి పదవిపై ఆశలేదు
ప్రధానమంత్రి పదవిపై తనకు ఆశలేదని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తేల్చి చెప్పారు. ప్రధానమంత్రి పదవికి తాను అనర్హుడినని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రధానమంత్రి మినహ అన్ని రకాల పదవులను తాను చేపట్టానని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. ఉపరాష్ట్రపతి పదవికి ఉండే ప్రోటోకాల్ తనకు ఇబ్బంది కల్గిస్తోందని ఆయన చెప్పారు.
పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు
పార్టీ ఫిరాయింపులపై ఉప రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు చేశారు.ఒక రాజకీయ పార్టీ తరఫున గెలిచి పదవీకాలం మధ్యలోనే మరో పార్టీలోకి ఫిరాయించే వారిపై ఫిర్యాదు అందిన 3 నెలల్లోగా అనర్హత వేటు వేయాలని స్పష్టం చేశారు. చట్టసభలకు చైర్మన్గా, స్పీకర్గా వ్యవహరించే వారు ఫిరాయింపుల వ్యవహారంపై అందే ఫిర్యాదులను 3 నెలలకు మించి పెండింగ్లో ఉంచుకోకూడదని చట్టమే చెబుతోందని గుర్తుచేశారు.ఇద్దరు రాజ్యసభ సభ్యులపై ఫిర్యాదు అందిన వెంటనే అనర్హత వేటు వేయడం ద్వారా తాను ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.
తెలుగు రాష్ట్రాల విషయమై మాట్లాడను
తెలుగు రాష్ట్రాల్లో కూడ ఫిరాయింపుల విషయమై నిర్ణయాలు పెండింగ్లో ఉన్న విషయాన్ని మీడియా ప్రతినిధులు ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకువచ్చారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో చట్టంలో పేర్కొన్న మేరకు తాను నిబంధనల ప్రకారం నడుచుకున్నానని, లోక్సభ స్పీకర్, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు వారి విచక్షణ మేరకు నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఇంతకుమించి దీనిపై తానేమీ మాట్లాడనని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల అభివృద్దికి కృషి
తెలుగు రాష్ట్రాల అభివృద్దికి కృషి చేస్తానని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు.తనకున్న పరిమితుల మేరకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సేవ చేస్తానని వెల్ల డించారు. పోలవరం ప్రాజెక్టు, గృహ నిర్మా ణం వంటి అంశాలపై సంబంధిత మంత్రులతో మాట్లాడానన్నారు. పాలకులు, రాజకీయ పార్టీల్లో మార్పు రావాలని ఆకాంక్షించారు. ప్రజలు అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని, వారిలో ప్రశ్నించే తత్వం పెరిగిందని వెంకయ్యనాయుడు చెప్పారు.