నేను జగన్ పార్టీలో లేనట్లే: అరకు ఎంపి గీత వ్యాఖ్య
విజయనగరం: తాను పార్టీని వీడినట్లేనని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు నిర్వహించే కార్యక్రమాల గురించి తనకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని, దాంతో తాను పార్టీని వీడినట్లేనని ఆమె అన్నారు.
విజయనగరం జిల్లా లచ్చయ్యపేటలో ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. ఇటీవల పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించినప్పటికీ తనతో ఏ విధమైన సంప్రదింపులు కూడా జరపలేదని ఆమె అన్నారు. సామాజిక మీడియాలో తనపై దుష్ప్రచారం జరిగినా పార్టీ నాయకులు ఎవరూ ఖండించలేదని ఆమె అన్నారు.
కొంత మంది నాయకులు తన ఎదుగుదలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. ఆ విషయంపై తాను పార్టీ అధ్యక్షుడు జగన్కు విన్నవించినా స్పందించలేదని ఆమె తప్పు పట్టారు. ప్రజాసమస్యలపై వ్యక్తిగతంగా పోరాటం చేస్తానని ఆమె అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి విజయం సాధించిన కొత్తపల్లి గీత పార్టీకి రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీలో చేరుతారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. ఆమె ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమావేశం కావడంతో ఆ ప్రచారం ముమ్మరమైంది.