జగన్ తర్వాత నేనే, అసూయ లేదు: జ్యోతుల నెహ్రూ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన రెడ్డి తర్వాత అన్నీ తానేనని, పార్టీలో రెండో స్థానం తనదేనని ఆ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ శనివారం వ్యాఖ్యానించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడనని చెప్పారు. పార్టీని మూసేస్తే తప్ప తాను మరో పార్టీకి వెళ్లనని చెప్పారు. ఈ సందర్భంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి రాకపోవడం చర్చకు వచ్చింది. ఆ పదవి భూమా నాగిరెడ్డికి రావడంపై తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు.
తామిద్దరమూ రాజకీయాల్లో సమకాలీకులమేనని, కాకతాళీయంగా ఒకే పార్టీల్లో సాగుతున్నామన్నారు. ఇద్దరమూ తెలుగుదేశం పార్టీలో కలిసి పని చేశామని, ప్రజారాజ్యంలో ఉన్నామని, ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నామని ఆయన చెప్పారు.
అందువల్ల, నాగిరెడ్డికి పదవి వస్తుందంటే తనకెలాంటి అసూయ లేదన్నారు. పార్టీలో తనకు తగినంత గౌరవం ఉందని, ఎందరున్నా తన తర్వాతేనని అన్నారు. పార్టీలో అధ్యక్షుడు వైయస్ జగన్ తర్వాత తానేనని, రెండో స్థానం తనదేనని, ఈ విషయాన్ని ఆన్ రికార్డుగానే చెబుతున్నానని అన్నారు.
స్వచ్ఛ భారత్లో జేపీ
లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ ఆదివారం స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా కూకట్పల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 2009లో ఆయన కూకట్పల్లి నుంచే అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
దేశంలో చేపట్టాల్సిన కార్యక్రమాల్లో స్వచ్ఛ భారత్ మొదటిదని, అయితే చాలా ఆలస్యంగానైనా ఈ కార్యక్రమం పట్టాలెక్కడం ఆహ్వానించదగ్గదేనన్నారు. తన స్వగ్రామంలో 431 మరుగుదొడ్లను నిర్మించానని చెప్పారు. స్వచ్ఛ భారత్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోడీకి తాను పూర్తి మద్దతు ప్రకటిస్తున్నానన్నారు.