నువ్వెప్పుడొచ్చినా నేను రెడీ; పులైతే సింగిల్ గా రావాలి: సాయిరెడ్డికి అయ్యన్నపాత్రుడు దిమ్మతిరిగే కౌంటర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, టిడిపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ట్విట్టర్ వేదికగా ఒకరిపై ఒకరు సవాళ్ళు విసురుతున్న ఇరువురు నేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. నువ్వో నేనో తేల్చుకుందాం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వీరిద్దరి మధ్య కొనసాగుతున్న రచ్చ రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహరీ గోడను కూల్చివేసిన ఘటన తర్వాత, దీనివెనుక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నాడని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన అయ్యన్నపాత్రుడు దమ్ముంటే నర్సీపట్నం రా.. తేల్చుకుందాం అంటూ విజయసాయి రెడ్డి కి సవాల్ విసిరారు. ఇక ఆ సవాల్ కు ప్రతిస్పందించిన విజయసాయిరెడ్డి.. డేటు టైము ఎక్కడో నువ్వే చెప్పు.. నేను రావడానికి సిద్ధంగా ఉన్నా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇదే సమయంలో అయ్యన్నపాత్రుడును పిల్లి అంటూ టార్గెట్ చేశారు.
ఇక విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు అయ్యన్నపాత్రుడు మరోమారు దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చారు. 16 నెలలు చిప్పకూడు తినడం వలన విజయ సాయి రెడ్డి శరీరం మందపడింది అని పేర్కొన్నారు. తోటి ఖైదీలు, ఖాకీల చేతిలో తిన్న దెబ్బల వలన ఏర్పడ్డ చారలు చూసుకొని విజయ సాయి రెడ్డి పులి గా ఫీల్ అవ్వడంలో తప్పు లేదు అంటూ సెటైర్లు వేశారు. బెయిల్ కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి ఢిల్లీ వెళ్లిన నువ్వు నన్ను అజ్ఞాతంలో ఉన్నావనడం విడ్డూరంగా ఉందని విజయసాయిరెడ్డిని అయ్యన్నపాత్రుడు టార్గెట్ చేశారు.
16 నెలలు చిప్పకూడు తినడం వలన శరీరం మందపడింది. తోటి ఖైదీలు, ఖాకీల చేతిలో తిన్న దెబ్బల వలన ఏర్పడ్డ చారలు చూసుకొని విజయ సాయి రెడ్డి పులి గా ఫీల్ అవ్వడంలో తప్పు లేదు. బెయిల్ కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి ఢిల్లీ వెళ్లిన నువ్వు నన్ను అజ్ఞాతంలో ఉన్నావనడం విడ్డూరంగా ఉంది. 1/2
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) June 25, 2022
అంతేకాదు తాను అజ్ఞాతంలో లేనని పేర్కొని, అంత గొప్పగా ఉంది నీ ప్రభుత్వ సమాచార వ్యవస్థ అంటూ మండిపడ్డారు అయ్యన్నపాత్రుడు. నేను నర్సీపట్నంలోనే ఉన్నా. ముహూర్తం ఎందుకు నువ్వు ఎప్పుడొచ్చినా నేను రెఢీ అంటూ ప్రకటించారు. అన్నట్టు పులి అయితే పోలీసుల్ని వెంట వేసుకొని రాదుగా సింగిల్ గా రావాలి అని షరతు పెట్టారు. అప్పుడు తేలిపొద్ది ఎవడు పులో ఎవడు పిల్లో! అంటూ అయ్యన్నపాత్రుడు విజయసాయి రెడ్డి పై విరుచుకుపడ్డారు. నువ్వు ఎప్పుడు వచ్చినా నేను రెడీ అంటూ ప్రకటించారు. మరి అయ్యన్నపాత్రుడు ప్రకటనతో విజయసాయిరెడ్డి ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.