''నన్ను ఒంటరిని చేశారు.. మీరే తేల్చుకోండి?..'' రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రచారాస్త్రం??
''నన్ను ఒంటరిని చేశారు.. మా అమ్మ విజయమ్మ చెల్లికి మద్దతుగా ఉండేందుకు వెళుతున్నారు.. గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసేటప్పుడు ఏం చెప్పారో మీకు గుర్తుండే ఉంటుంది.. తన బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నానని, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు.. కాబట్టి నాకు ఈరోజు ఎవరూ లేరు.. నేనున్నది మీ కోసమే.. ప్రతిపక్షాలు, 'దుష్టచతుష్టయం' ఎలా వ్యవహరిస్తున్నాయో చూశారుగా..!! రాష్ట్రంలో ఇదీ పరిస్థితి...'' అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలో ప్రజలకు చెప్పబోతున్నారు.

నన్ను గెలిపించండి.. కానీ ప్రతిపక్షాల మాయలో మాత్రం పడొద్దు!!
త్వరలో జగన్మోహన్రెడ్డి బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటినుంచే ప్రచారానికి కావల్సిన ''సరంజామా'' మొత్తం సిద్ధమవుతోంది. ''ఒకవైపు తల్లి, చెల్లి తెలంగాణకు వెళ్లారు.. మరోవైపు ప్రతిపక్ష తెలుగుదేశంతోపాటు కొన్ని మీడియా సంస్థలు కలిసి నాపై కుట్ర పన్నాయి.. సంక్షేమ పథకాలు అందరికీ అందాయి.. ఇవన్నీ మీరు నమ్మితేనే నన్ను గెలిపించండి.. కానీ ప్రతిపక్షాల మాయాలో మాత్రం పడొద్దు'' అనేదే వైసీపీ స్లోగన్ గా మారాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు సమాచారం అందింది.

అధికారం ఎవరికనేది మీరే నిర్ణయించుకోండి?
''రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి అధికారం ఇవ్వాలి? ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలి? అనేది మీరే నిర్ణయించుకోండంటూ'' ప్లీనరీ వేదికగా జగన్ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలో జగన్మోహన్రెడ్డి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు, జిల్లాల పర్యటనలకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీనిపై ఆలోచనలో పడిన జగన్ స్వయంగా తీసుకున్న నిర్ణయమే బస్సు యాత్ర అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

టీడీపీకి వస్తున్న స్పందన చూసి బస్సు యాత్ర!!
ప్లీనరీకి ముందు తాజాగా తీసుకున్న నిర్ణయమని, వాస్తవానికి యాత్ర చేపట్టాలనే ఆలోచన జగన్ కు లేదని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఒకవైపు గడప గడపకు మీ ప్రభుత్వం పేరుతో కార్యక్రమం జరుగుతోంది. ఇది పూర్తవబోయే సమయంలో యాత్ర చేపట్టాలని ముఖ్యమంత్రి భావించారు. కానీ టీడీపీ అధినేత పర్యటనకు వస్తున్న స్పందన చూసిన తర్వాత జగన్ ఆలోచనలో మార్పు వచ్చిందని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే తమ నేత యాత్రకు శ్రీకారం చుట్టారని వైసీపీ శ్రేణులు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications