న్యూ ఇయర్, సంక్రాంతికి దూరం: మనస్సు అంగీకరించడం లేదంటూ పవన్ కళ్యాణ్ భావోద్వేగం
అమరావతి: నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉండనున్నట్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజధాని ప్రాంతంలో రైతులు, కూలీలు, మహిళల ఆవేదన చూసి తన హృదయం ద్రవించిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి దుస్థితి దౌర్భాగ్యకరం..
రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతులు 33వేల ఎకరాల భూమి అదనంగా ఇచ్చారని.. అలాంటి రైతులు దైన్యంగా రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా నిరాహార దీక్షలు, నిరసనలు చేస్తున్నారని అన్నారు. ఎప్పుడూ గడపదాటని మహిళలు సైతం రోడ్లపైకి రావాల్సిన దుస్థితి రావడం దౌర్భాగ్యకరమని వ్యాఖ్యానించారు.

నా మనస్సు అంగీకరించడం లేదు..
తమ బిడ్డల భవిష్యత్ కోసం భూములు ఇచ్చామని, ఇప్పుడు అసలు భవిష్యత్తే లేకుండా పాలకులు నిర్ణయాలు చేస్తున్నారని రైతులు కన్నీటితో చెబుతున్నారని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త సంవత్సర వేడుకలుగానీ, సంక్రాంతి పండుగ చేసుకోవడానికి తన మనస్సు అంగీకరించడం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.

అందుకే వేడుకలకు దూరం...
ఈసారి ఈ వేడుకలకు, తాను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. అందువల్ల మీకు(ప్రజలకు) కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయలేకపోతున్నందుకు క్షంతవ్యుణ్ణి అని అన్నారు. అమరావతి రైతులు, వాటి కుటుంబాలు ఆనందంగా గడిపే రోజు వచ్చిన నాడే తనకు నిజమైన సంక్రాంతి అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

వీళ్లంతా ఆత్మగౌరవంతో బతికే రైతులు..
‘రైతుల దీక్షలకు సంఘీభావం తెలపాలని రాజధాని గ్రామాల్లో పర్యటిస్తే నా పర్యటన పోలీసులు అడ్డుకోవాలని చూశారు. వారిపై నాకెలాంటి కోపం లేదు. వారి బాసులు ఏం చెపితే కానిస్టేబుళ్లు అలా చేస్తారు. ప్రజా ప్రతినిధులు ఈ రోజు ఉంటారు.. రేపు వెళ్లిపోతారు. ఈ విషయాన్ని పోలీసులు గుర్తు పెట్టుకోవాలి. ఆందోళన చేస్తున్న రైతుల ఇళ్లలోకి వెళ్లి ఇబ్బందిపెట్టడం చాలా పాపం. అలాంటి పనులు చేయబోమని కానిస్టేబుళ్లు పోలీస్ బాసులకు చెప్పాలి. రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులెవరూ 17 నెలలు జైల్లో కూర్చున్న వ్యక్తులు కాదు. సూట్ కేస్ కంపెనీలు పెట్టి జైల్లోకి వెళ్లిన వ్యక్తులు కాదు. ఆత్మ గౌరవంతో బతికే రైతులకు కులం, మతం లేదు' అని పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications