ఆ భూమి వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదు:మరోసారి స్పష్టం చేసిన బోండా ఉమ
విజయవాడ:తనపై ఆరోపణలు చేస్తున్న ఆ భూ వివాదానికి...నాకు, నా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ మరోసారి స్పష్టం చేశారు.
గత ఏడాది ల్యాండ్ డెవలప్ మెంట్ కోసం తన భార్య పేరుతో అగ్రిమెంట్ చేసుకున్న విషయం వాస్తవమేనని బోండా ఉమ తెలిపారు. అయితే ఆ స్థలం కేసు కోర్టులో ఉందని తెలిసి ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని బోండా ఉమ చెబుతున్నారు. సీఐడీ విచారణలో ఈ వివాదంలో తమ తప్పు లేదని తేలడంతో కోర్టు కేసు కొట్టేసిందని బోండా ఉమ వివరించారు. అయితే ఆ విషయాన్ని దాచిపెట్టి మళ్లీ తప్పుడు పత్రాలతో కోర్టులో పిటిషన్ వేశారని ఆయన చెప్పుకొచ్చారు.
ఇదంతా తనపై ఉద్దేశపూర్వకంగా బురద జల్లేందుకు జరుగుతున్న కుట్రా అని, అలాంటి వారిపై న్యాయపోరాటం చేస్తానని బోండా ఉమ ప్రకటించారు. తనను ఎదుర్కొనే దమ్ము లేక కోర్టును సైతం పక్కదారి పట్టించారని ఆయన మండిపడ్డారు. తాను తప్పు చేసినట్లు రుజువు చేస్తే ఉరిశిక్షకైనా సిద్ధమని బోండా ఉమ వ్యాఖ్యానించారు.
ఎంఎల్ఎ బోండా ఉమాకు హైకోర్టు బుధవారం హై కోర్టు తీర్పుతో షాక్ తగిలిన సంగతి తెలిసిందే. నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో స్వాతంత్య్ర సమరయోధునికి చెందిన సుమారు రూ.60 కోట్ల విలువైన 5.16 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారంలో బోండా ఉమాపైనా, అతని భార్య సుజాత, మరో 8 మందిపైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు బుధవారం నగర పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది
కోటేశ్వరరావు అనే వ్యక్తి...ఈ భూవివాదానికి సంబంధించి బోండా ఉమ తనను బెదిరించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోడంతో...అతడు హైకోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్ను విచారణకు స్వీకరించిన హై కోర్టు తదుపరి చర్యలకు ఆదేశాలిచ్చింది.