బాబూ! మీకు 2దారులు, రూ.40 కోట్లు కుదరదు: పవన్, పార్టీ గుర్తు పిడికిలి
Recommended Video
రెంటచింతల: 2014లో తాను జనసేన పార్టీ పెట్టిన సమయంలో కొంతమంది కాపు నేతలు మీకు అండగా ఉంటామని చెప్పారని, వారితో తాను అప్పుడే చెప్పానని, నేను కులాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి రాలేదని చెప్పానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం అన్నారు. కానీ తాను అన్ని కులాలను గౌరవిస్తామన్నారు. పవన్ కులాలను నమ్ముతున్నారని చంద్రబాబు విమర్శిస్తారని, అదే అయితే 2014లో మీకు ఎలా మద్దతిచ్చానని ప్రశ్నించారు. మీరు పెద్దలని, దశాబ్దాల అనుభవం ఉందన్నారు.
తెలంగాణపై పవన్ కళ్యాణ్ దృష్టి, 'అన్నిస్థానాల్లో పోటీకి సిద్ధం'
చంద్రబాబు, జగన్ కులాల గురించి నేను మాట్లాడనని, ఎందుకంటే నేను కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతమైన వ్యక్తిని అన్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని ఉందని, అది తెలిసీ చంద్రబాబు హామీ ఇచ్చి దానిని తప్పారన్నారు. కాపు రిజర్వేషన్లపై తాము డ్రామాలు ఆడనని చెప్పారు. రాజ్యాంగం బీసీలకు ఇచ్చిన హక్కులపై తాము అండగా ఉంటామని చెప్పారు.
నాతో ఉండేవాళ్లకు సుఖం ఉండదు
నాతో ఉండాలనుకునే వాళ్లకు సుఖం ఉండదని చెప్పారు. ఆడపడుచులను అర్థం చేసుకున్నా కాబట్టే ఎక్కువ తిట్లు తింటున్నానని అన్నారు. నా జీవితంలో విందులు, పబ్బులు ఉండవని చెప్పారు. ఓ మూలన కూర్చొని పుస్తకాలు చదువుకుంటానని చెప్పారు. నా వ్యక్తిగత జీవితం భిన్నమైనదని చెప్పారు. ఎక్కడో ఢిల్లీలో నిర్భయపై అత్యాచారం జరిగితే దేశమంతా ఏడ్చిందన్నారు. అలాంటి మహిళలను కులాల వారీగా విభజించడం సరికాదన్నారు. ఆడపడుచులకు అందరం అండగా ఉండాలన్నారు.
మీ ముందు రెండే ఛాయిస్లు
టీడీపీ బృందాలు, రౌడీలకు తాను భయపడేది లేదని పవన్ చెప్పారు. వారికి ఉన్నవి రెండే అవకాశాలని అల్టిమేటం జారీ చేశారు. ఒకటి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయాలని, నేను అలా సిద్ధమని చెప్పారు. లేదంటే వీధుల్లోకి వస్తానంటే నేనూ సిద్ధమన్నారు. అవసరమైతే కర్ర పట్టుకొని పోరాడుతానని చెప్పారు. ఎర్రకాలువ సమస్యపై తాను ప్రజాస్వామ్య పద్ధతిలో అడుగుతున్నానని చెప్పారు.
రిజర్వేషన్ల గురించి మాట్లాడితే
మన దేశంలో అన్ని కుల్లాల్లో వెనుకబడిన వారు ఉన్నారని పవన్ చెప్పారు. అగ్రకులాల్లోను ఎంతోమంది వెనుకబడ్డారని, కాబట్టి వారు కూడా తమకు రిజర్వేషన్లు డిమాండ్ చేసే పరిస్థితి వచ్చిందని, వైశ్యులు, కాపులు కూడా అంతే అన్నారు. రిజర్వేషన్ల గురించి మాట్లాడాలంటే జనసేన మొదట మహిళల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతుందన్నారు. మహిళా రిజర్వేషన్లకు మేం అండగా ఉంటామన్నారు. టీడీపీ, చంద్రబాబులను తాను ప్రశ్నిస్తున్నానని, మహిళలకు మీ పార్టీలలో రిజర్వేషన్లు ఇస్తారా అని నిలదీశారు. ప్రధాని మోడీ కూడా మహిళలు అంటే గౌరవం ఉన్న వ్యక్తి అని, లోకసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టగలరా అని ప్రశ్నించారు.
ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తాం
జగన్ లక్ష కోట్లు దోచుకున్నారని టీడీపీ అంటోందని, లక్షన్నర కోట్లు టీడీపీ దోచుకుందని జగన్ అంటున్నారని, కాబట్టి మనం మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వవచ్చు అని పవన్ అన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చి తీరుతామని చెప్పారు. ఆడపడుచులకు తినలేని రూ.1 కిలో బియ్యం ఎందుకన్నారు. కాబట్టి ఆడపడుచులకు నెలకు రూ.2500 నుంచి రూ.3వేలు అకౌంట్లో వేస్తే వారు ఇష్టమున్నవి తింటారని చెప్పారు.
ముస్లీంలు పాకిస్తాన్ వారు కాదు
ముస్లీంలు భారతదేశంలో భాగమని, వారు భారతీయులని, వారేం పాకిస్తాన్ వారు కాదని చెప్పారు. ముస్లీంలకు అండగా ఉంటానని చెప్పారు. చిన్నప్పటి నుంచి తాను ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు చూస్తున్నానని, కానీ అందరికి ఒకే హాస్టల్స్ ఎందుకు ఉండవని ప్రశ్నించారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు కుల, మతం అంటూ విషం పెంచుతున్నారన్నారు. అన్ని కులాలు ఇష్టపడితే తాను విద్యావ్యవస్థలో మార్పులు తెస్తానని, అందరికీ ఒకే హాస్టల్ పెడతానని చెప్పారు. కులాల సఖ్యత రావాలంటే చిన్న వయస్సులోనే ఆ భావం పెంపొందించాలన్నారు. అగ్రకులస్తులకు అండగా ఉంటామని చెప్పారు.
జనసేన పిడికిలి, సీఎంగా మీ ఇష్టం
జనసేన గుర్తు పిడికిలి అని పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను మన బిడ్డల బాగు కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. 25 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని అన్నారు. సమస్యలు ఉంటాయని తెలుసునని, వాటికి సకిద్ధపడే వచ్చానని చెప్పారు. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు తనకు సమానమని చెప్పారు. లక్ష కోట్లు తిన్నారని టిడిపి, లక్షన్నర కోట్లు తిన్నారని వైసీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారని, అలాంటి నేతలు వారని, 2019లో సీఎంగా ఎవరినిచేస్తారో మీకు ఛాయిస్ వదిలేస్తున్నానని, మీరు నన్ను సీఎంగా చేయకున్నా అందరికీ అండగా ఉంటానని చెప్పారు. లోకేష్ మీ తండ్రిగారిని ఆదర్శంగా తీసుకోకుండా మహాత్ములను తీసుకోవాలన్నారు. లోకేష్ వెన్నుపోట్లతో ముఖ్యమంత్రి కావాలనుకోవద్దన్నారు. క్షేత్రస్థాయికి వచ్చి కష్టాలు తెలుసుకోవాలన్నారు. రూ.40 కోట్లు ఇచ్చి నియోజకవర్గాన్ని స్వాధీనం చేసుకుందామంటే కుదరదన్నారు. టీడీపీ వల్ల ప్రత్యేక హోదా కాదు కదా.. కనీసం రైల్వే ఓవర్ బ్రిడ్జి కూడా రాదన్నారు. జనసేన అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాలు అన్నారు.