చంద్రబాబుపై కెవిపి వ్యంగ్యాస్త్రాలు: అసలు ఏం జరుగుతోంది?
మరో రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ‘భారత్ రత్న’ అవార్డు ఇవ్వాలని కోరుతూ తానే స్వయంగా కూడగడతానని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ/ అమరావతి: మరో రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు 'భారత్ రత్న' అవార్డు ఇవ్వాలని కోరుతూ తానే స్వయంగా మద్దతు కూడగడతానని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ వాసులను ఒప్పించి మరీ చంద్రబాబుకు 'అపర భగీరథుడు' అనే బిరుదు ఇప్పిస్తానని ఎద్దేవా చేశారు. 2019 నాటికి పోలవరం ప్రధాన డ్యామ్ పూర్తయ్యే అవకాశమేలేదని కేవీపీ అన్నారు.
ఒకవేళ అద్భుతాలు జరిగితే తప్ప, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కేంద్ర జల సంఘం అనుమతించిన డిజైన్ మేరకు ప్రాజెక్టు పూర్తిచేసి కుడి, ఎడమ కాలువల నుంచి గ్రావిటీద్వారా నీటిని ఇవ్వడం అసాధ్యమని అన్నారు. ఈ మేరకు చంద్రబాబుకు ఆయన బహిరంగ లేఖ రాశారు.
పోలవరం ప్రాజెక్టుకు
పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నట్లు తెలుగుదేశం మంత్రులు, నాయకులు రుజువు చేయాలని సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నట్లు రుజువు చేస్తే తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వైదొలుగుతానని కేవీపీ సవాల్ చేశారు. కమీషన్లు దండుకునేందుకే కేంద్రం వద్ద ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి.. పోలవరం పనుల బాధ్యత తీసుకున్నారంటూ సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రారావు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే కేంద్రం షరతులపైనా నోరు మెదపడం లేదని మండిపడ్డారు.
Recommended Video
నిజంగా 2019లోపు పోలవరం పూర్తవుతుందా?
కాపర్ డ్యాంను ప్రధాన డ్యాంగా చూపుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నారని కేవీపీ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు వైస్రాయ్ నాటకాలు గుర్తుకొస్తున్నాయని విమర్శించారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం 2019లోపు పోలవరం వద్ద గోదావరి నదిపై ‘కాపర్ డ్యామ్' నిర్మాణం మాత్రమే పూర్తవుతుందని పేర్కొన్నారు. అసలు సంగతేమిటంటే దురదృష్టవశాత్తు అబద్ధాలకు అలవాటుపడిన ఏపీ సీఎం చంద్రబాబు ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేస్తేనే సీఎంగా ప్రమాణం స్వీకరిస్తానని షరతుపెట్టి.. దాన్ని సాధించిన ఘనత తనదేనని గొప్పగా చెప్పుకొంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచందర్ రావు మండిపడ్డారు.
తెలంగాణ ఏర్పడకముందే ఏడు మండలాలపై ఇలా ఆర్డినెన్స్
2014లో ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేయడానికి ముందు ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రులందరినీ కలిశారని, ఆ సమయంలో కాంగ్రెస్ ఎంపీ జైరాంరమేశ్ సైతం పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందిగా పట్టుబట్టారని కేవీపీ గుర్తుచేశారు. హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్తో జరిగిన సమావేశంలో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన కొనసాగుతున్నందువల్ల రాజ్యాంగంలోని మూడో అధికరణం ప్రకారం శాసనసభపై పూర్తి హక్కులు పార్లమెంటుకే ఉంటాయని.. కాబట్టి పోలవరం ముంపు మండలాలపై ఆర్డినెన్సును జారీ చేయాలని రాజ్నాథ్ను కోరినట్లు కేవీపీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం జూన్ 2న ఏర్పడుతున్నందున ముంపుమండలాల విలీన ప్రక్రియ ఆ లోపే పూర్తి కావాలని, లేదంటే ఆ తర్వాత న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయన్న ఆందోళనను వ్యక్తం చేశామని, ఇదంతా చంద్రబాబు సమక్షంలోనే జరిగిందని కేవీపీ గుర్తుచేశారు. ఈ వివరాలన్నింటినీ రాజ్యసభలో ముంపు మండలాల ఆర్డినెన్సుపై ప్రవేశపెట్టి బిల్లుపై చర్చ సందర్భంలో హోంమంత్రి రాజ్నాథ్ ప్రస్తావించారని వివరించారు.
రాష్ట్రపతి పాలన వల్లే పెండింగ్లో ఈ ఆర్డినెన్స్
మరో వాస్తవమేమిటంటే పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం పేరుతో ఖమ్మంజిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడానికి యూపీఏ హయాంలోనే ప్రయత్నాలు జరిగాయని ఆయన తెలిపారు. 2014 మార్చి 2నాటికే ఆర్డినెన్సును అప్పటి కేంద్ర ప్రభుత్వం సిద్ధంచేసినా ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన కారణంగా సాధ్యం కాలేదని కేవీపీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత.. మార్చి 2న నిర్వహించిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలోనే ఈ మండలాలను అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపేందుకు నిర్ణయించారని ఆయన గుర్తుచేశారు. ఈ మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపితే రెండు రాష్ర్టాల సరిహద్దులు మారుతాయి కాబట్టి.. ఉనికిలో ఉన్న రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కానీ అప్పుడు రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన ఉన్నందున ఇది సాధ్యంకాక ఆర్డినెన్సు నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టారని వివరించారు. కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ అంగీకరించలేదని కేవీపీ పేర్కొన్నారు. తదుపరి పార్లమెంటు సమావేశాల్లో ఈ ఆర్డినెన్సుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలుపాలని కూడా ఆనాటి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారన్నారు.