మా వాడిని కలిశా, శిక్ష తప్పదు: జగన్పై జెసి, 'సోనియాలో విభజన పశ్చాత్తాపం లేదు'
విజయవాడ: సంచలనాలకు మారుపేరైన తెలుగుదేశం పార్డీ అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి ఆదివారం నాడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు తాను ఢిల్లీలో మా వాడిని కలిశానని.. వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చెప్పారు.
మావాడిని పార్లమెంటు గేటు వద్ద కలిశానని చెప్పారు. మావాడితో రాజకీయాలు ఏం మాట్లాడలేదని, బాగున్నావా అంటే బాగున్నావా అని పలకరించుకున్నామన్నారు. ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఆ తర్వాత ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని కలిశానని చెప్పారు.
అయితే రాష్ట్ర విభజన పట్ల సోనియా గాంధీలో ఎలాంటి పశ్చాత్తాపభావం కనపడలేదన్నారు. రాహుల్ గాంధీతో మాట్లాడినప్పుడు రాష్ట్ర విభజనపై పశ్చాత్తాపం వ్యక్తం చేశాడన్నారు. అనంతరం రాహుల్ గాంధీ.. జగన్ గురించి మాట్లాడారన్నారు.
రాహుల్ గాంధీ భావాలు జగన్ పైన సదాభిప్రాయం ఉన్నట్టు కనపడలేదన్నారు. అలాగే జగన్కు శిక్ష తప్పదని కూడా ఆయన చెప్పారని జేసీ వ్యాఖ్యానించారు వైసిపి నుంచి టిడిపిలోకి ఎమ్మెల్యేలు ప్రవాహంలా వస్తారని, ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు టిడిపి నేతలతో టచ్లో ఉన్నారన్నారు. త్వరలోనే వైసిపి ఖాళీ అవుతుందన్నారు.