హోదాపై సంతకం పెడితే మద్దతు, 25 మందిని ఇవ్వండి: కాంగ్రెస్-బీజేపీలకు జగన్ ఆఫర్
Recommended Video
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎవరు ఇస్తామంటే, హోదా ఫైల్పై ఎవరు సంతకం పెడితే తాము వారికి మద్దతు ఇస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
ప్రత్యేక హోదా విషయంలో ఎవరినీ నమ్మవద్దని చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా ఏపీకి న్యాయం జరగాలన్నారు. ఎవరినీ నమ్మకుండా 25 మంది ఎంపీలను వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే, హోదా ఇచ్చిన వారికి తాము మద్దతిస్తామన్నారు.
బీజేపీపై చంద్రబాబు యూటర్న్ వెనుక..: జగన్ వ్యాఖ్య ఇదీ
గోబెల్స్ ప్రచారం
చంద్రబాబు గోబెల్స్ ప్రచారాలను బాగా నమ్మే వ్యక్తి అని ఎద్దేవా చేశారు. అబద్దాన్ని పదేపదే చెప్పి నిజమని నమ్మడం గోబెల్స్ సిద్ధాంతమని చెప్పారు. చంద్రబాబు తన అనుకూల మీడియాలో ఇప్పుడు అదే చేస్తున్నారన్నారు. రాజధాని అమరావతి మొదలు అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికాడన్నారు.
హోదా కావాలని
హోదా కావాలని మొదట చెప్పి, ఆ తర్వాత హోదా సంజీవిని కాదని చెప్పి యూటర్న్ తీసుకున్నారని తెలిపారు. రాజకీయాల్లో విశ్వసనీయత, క్రెడిబులిటీ, క్యారెక్టర్ చాలా ముఖ్యమని చెప్పారు. కేంద్రం మొదటిసారి హోదా ఇవ్వనని చెప్పినప్పుడే రాజీనామాలు చేసి ఉంటే ఫలితం ఉండేదన్నారు.
బీజేపీ, కాంగ్రెస్
బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలు సమన్యాయమని ఏపీని విడగొట్టాయన్నారు. స్వాతంత్రం నేనే తెచ్చానని చెప్పినట్లుగా చంద్రబాబు తీరు ఉంటుందన్నారు. హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదని అజిత్ సింగ్ చెప్పారని, ఇవన్నీ చంద్రబాబుకు గుర్తుకు లేదా అని ప్రశ్నించారు.
తెలంగాణలో నష్టం జరుగుతుందని తెలిసినా
విభజనకు కాంగ్రెస్, బీజేపీలతో పాటు చంద్రబాబు కూడా కారణమని జగన్ అన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని నిలబడ్డ ఏకైక పార్టీ వైసీపీనే అని చెప్పారు. తెలంగాణలో నష్టం జరుగుతుందని తెలిసినా ధైర్యంగా నిలబడ్డామన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ఏపీ కోసం చిత్తశుద్ధితో కలిసి రావాలన్నారు.