నేను అప్పుడే చెప్పా.. నాపై పవన్ పోటీయా, సత్తా ఏంటో చూపిస్తా: ప్రభాకర్ చౌదరి
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ చేతుల్లో ఉన్నారని తాను మూడు నెలల క్రితమే చెప్పానని అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చెప్పారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద, లాబీల్లో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వామపక్షాలు సైతం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాయని చెప్పారు.
చంద్రబాబు తర్వాత తానే ప్రత్యామ్నాయామని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని, అందుకే లోకేష్పై ఆయన ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆరోపించారు. జనసేన అధినేత పవన్కల్యాణ్ త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని పలు సందర్భాల్లో పేర్కొన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో.. పవన్ కల్యాణ్ మీపైనే పోటీ చేయబోతున్నారట కదా... అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి స్పందించారు. 'ఆయన అనంతపురంలో నాపై పోటీకి వస్తానంటే స్వాగతిస్తాను. అలాగే నా సత్తా ఏమిటో కూడా చూపిస్తా..' అని వ్యాఖ్యానించారు.