నా తండ్రి జీవించి ఉన్నంత వరకు నన్ను అలా చూశారు: జగన్
Recommended Video
హైదరాబాద్: తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నంత వరకు తనను గౌరవనీయమైన వ్యక్తిగానే చూశారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. ఆయన జాతీయ చానెల్ ఎన్డీటీవీతో సోమవారం ప్రత్యేకంగా మాట్లాడారు.
తన తండ్రి మరణించిన తర్వాత కాంగ్రెసుతో తెగదెంపులు చేసుకోవడమే తనపై డజను దాకా కేసులు పెట్టడానికి కారణమని ఆయన అన్నారు. గత దశాబ్ద కాలంగా తనపై ఉన్న కేసుల గురించి ప్రస్తావించినప్పుడు తన తండ్రి బతికి ఉన్నంత వరకు తాను గౌరవనీయమైన వ్యక్తినే అని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినంత వరకు తన తండ్రి వైఎస్ రాజశేఖ రెడ్డి కూడా గౌరవనీయమైన వ్యక్తేనని అన్నారు.
కేసులు రాజకీయ కారణాల వల్లే...
యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు తనపై కేసులు పెట్టారని, అవి రాజకీయ ప్రేరేపితాలేనని జగన్ అన్నారు. పిటిషనర్లు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నాయకులేనని చెప్పారు. కాంగ్రెసు నుంచి విడిపోయి వైఎస్ జగన్ 2009లో వైఎస్సార్ కాంగ్రెసును స్థాపించిన విషయం తెలిసిందే.
చంద్రబాబు వైఫల్యం వల్లే..
ఎన్డీఎ మిత్రుడైన చంద్రబాబు ప్రత్యేక హోదాను సాధించడంలో విఫలమయ్యారని జగన్ విమర్శించారు. చంద్రబాబు పట్ల కేంద్రం మెతక వైఖరి అవలంబిస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబు అవినీతిలో కూరుుకుపోయారని అన్నారు. ఇసుక, మద్యం, విద్యుచ్చక్తి, బొగ్గు - అన్నింట్లోనూ చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం వల్లనే చంద్రబాబుపై కేసులు పెట్టడం లేదని అన్నారు.
అవిశ్వాసం పెట్టే తీరుతాం..
బిజెపితో కుమ్మక్కయినట్లు వస్తున్న ఆరోపణలకు సమాధానమిస్తూ - కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే తీరుతామని జగన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని కృతనిశ్చయంతో ఉందని చెప్పారు.
ఎంపీలకు అల్టిమేటం ఇచ్చా...
అవిశ్వాసం ప్రతిపాదించే విషయంలో తాను తమ పార్టీ పార్లమెంటు సభ్యులకు అల్టిమేటం ఇచ్చినట్లు చెప్పారు. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర గుంటూరు జిల్లాలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ ప్రజా సంకల్ప యాత్రలోనే ఆయన ఎన్డీటీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.