టిడిపిలో చేరాలని బంపర్ ఆఫర్, టిడిపిని అందుకే వీడా, బాబుపై రోజా సంచలనం
అమరావతి: టిడిపిలో చేరాలని తనకు ఆహ్వనం వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఈ ఆహ్వనం విషయమై సరైన సమయంలో వెల్లడిస్తానని ఆమె ప్రకటించారు.
ఏపీ రాష్ట్రంలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను టిడిపి ఆకర్షిస్తోంది. అయితే ఇప్పటివరకు సుమారు 24 మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టిడిపిలో చేరారు. అయితే వైసీపీకి చెందిన కీలక నేతతో కూడ చర్చలు జరుగుతున్నాయని ఇటీవలనే మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.
జగన్ పాదయాత్ర సాగుతున్న సమయంలోనే ఆ పార్టీని మరింత తీవ్రంగా నష్టపర్చాలనే ఉద్దేశ్యంతో టిడిపి వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. అయితే ఇందులో భాగంగానే రోజాను టిడిపిలో చేరాలని ఆ పార్టీ ఆఫర్ ఇచ్చిందనే అనుమానాలు కూడ వ్యక్తమౌతున్నాయి. ఈ విషయాన్ని ఓ టీవి ఛానెల్ ఇంటర్వ్యూలో రోజా ప్రకటించారు.

టిడిపిలో చేరాలని ఆఫర్ ఇచ్చారు.
వైసీపీని విడిచి టీడీపీలోకి తనను రమ్మనమంటూ ఆహ్వానం వచ్చిందని చెప్పారు. ఈ ఆహ్వానం విషయమై సరైన సమయంలో తాను మాట్లాడతానని ఆమె ప్రకటించారు. రోజా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి.

చంద్రబాబు కారణంగానే టిడిపిని వీడాను
చంద్రబాబునాయుడు కారణంగానే తాను టిడిపిని వీడాల్సి వచ్చిందని రోజా చెప్పారు.నగరి, చంద్రగిరి.. ఇలా ఎక్కడంటే అక్కడ తనను పోటీ చేయాలంటూ చంద్రబాబు నాడు ఇబ్బంది పెట్టారని, అందుకే, టీడీపీని వీడాల్సి వచ్చిందని చెప్పారు. తన సామాజిక వర్గానికి చెందిన గాలి ముద్దుకృష్ణమనాయుడు కోసం తనకు సరైన నియోజకవర్గం లేకుండా చేశారని ఆమె ఆరోపించారు.

చంద్రబాబు వారిని తొక్కేశారు.
టిడిపిలో ఉన్న సమయంలో ఎలిమినేటి మాధవరెడ్డి, నాగం జనార్తన్ రెడ్డి,దేవేందర్గౌడ్లను చంద్రబాబునాయుడు తొక్కేశారని రోజా ఆరోపించారు.తన కంటే వేరేవాళ్ళకు పేరు వస్తోందని భావిస్తే వారిని పార్టీలో ఎదగనీయకుండా తొక్కేసేవాడని రోజా ఆరోపించారు.

చంద్రగిరిలో బాబు ఎందుకు పోటీ చేయరు
చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు ఎందుకు పోటీ చేయరని రోజా ప్రశ్నించారు.బాబు స్వంత నియోజకవర్గం చంద్రగిరి నియోజకవర్గమే అని ఆమె గుర్తు చేశారు.కుప్పంలో ఎందుకు పోటీ చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.వైసీపీ నుండి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలని ఆమె డిమాండ్ చేశారు












Click it and Unblock the Notifications