జగన్కు షాకిస్తారా: 'టిడిపిలో చేరడం లేదు, 2019లో పోటీపై వారంలో నిర్ణయం'
ఒంగోలు: తాను వైసీపీని వీడి, టిడిపిలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని వైసీపీ నేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చెప్పారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయాన్ని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్కు చెప్పిన విషయం వాస్తవమేనన్నారు.
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నారనే ప్రచారం సాగుతోంది. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్కు కూడ చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా బూచేపల్లి కుటుంబం ఉంటే ఎవరిని ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దింపాలనే విషయమై వైసీపీ నాయకత్వం ఆరా తీస్తోంది. అయితే ఇప్పటికే కొందరు నేతలపై వైసీపీ నాయకత్వం దర్శి నియోజకవర్గం నుండి బరిలోకి దింపేందుకు ఆలోచిస్తోంది

వైసీపీని వీడే ప్రసక్తే లేదు
వైసీపీని వీడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి స్పష్టం చేశారు.ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని బూచేపల్లి శివప్రసాద్రెడ్డి కుటుంబం నిర్ణయం తీసుకొందని సమాచారం. అయితే పార్టీ సీనియర్లు ఈ విషయమై బూచేపల్లి కుటుంబంతో చర్చించిన మీదట కొంద వైఎస్ఆర్ ఫ్యామిలీ కార్యక్రమంలో బూచేపల్లి పాల్గొంటున్నారని అంటున్నారు.

టిడిపిలో చేరుతారా
టీడీపీలో చేరుతున్నానన్న వార్తలు అవాస్తవమని చెప్పారు. ఆ పార్టీ నాయకులతో చర్చించలేదని, వారెవరినీ తాను కలవలేదని బూచేపల్లి శివప్రసాద్రెడ్డి చెప్పారు. ‘మా కుటుంబం వైఎస్ రాజశేఖరరెడ్డి మీద ప్రేమతో రాజకీయాల్లోకి వచ్చింది. ఆయన చనిపోయాక జగన్ నాయకత్వంలో పనిచేయాలని కాంగ్రెస్ ని వదిలిపెట్టి వచ్చాం. మేమెప్పటికీ వైఎస్ కుటుంబానికి విధేయులుగానే ఉంటాం. జగన్ సీఎం కావాలని పరితపిస్తున్నాం' అని ఆయన చెప్పారు.

2019 ఎన్నికల్లో పోటీపై వారంలో నిర్ణయం
నంద్యాల ఉప ఎన్నికకు ముందు తాను జగన్ను కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీచేయలేనని చెప్పినమాట వాస్తవమేనన్నారు. ఎన్నికల్లో తాను పోటీచేయాల్సిందేనని కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారని, ఈ విషయమై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని శివప్రసాద్రెడ్డి తెలిపారు.

బూచేపల్లి ఏం నిర్ణయం తీసుకొంటారు
దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఏం నిర్ణయం తీసుకొంటారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. బూచేపల్లి శివప్రసాద్రెడ్డి టిడిపిలో చేరుతారనే ప్రచారం వైసీపీని ఇబ్బందులకు గురిచేస్తోంది. అదే సమయంలో వైసీపీలోని కీలక నేతలతో బూచేపల్లి శివప్రసాద్రెడ్డికి పొసగడం లేదు. ఈ కారణంగానే బూచేపల్లి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై కూడ వారం రోజుల్లో నిర్ణయం తీసుకొంటానని బూచేపల్లి స్పష్టం చేశారు. అయితే బూచేపల్లి తీసుకొనే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications