నాన్న పనిచేసిన చోటే ఇల్లు, ఆస్తులు ప్రకటిస్తా, గుంటూరు సభలోనే భవిష్యత్ కార్యాచరణ: పవన్
అమరావతి: పార్టీ భవిష్యత్ కార్యాచరణను పార్టీ ప్లీనరీలో ప్రకటించనున్నట్టు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీపై ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందన్నారు. దాన్ని నిలబెట్టుకోనే ప్రయత్నం చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా కాజాలో సోమవారం నాడు ఉదయం సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ భూమి పూజ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.
సొంత ఇంటి నిర్మాణంతో పాటు పార్టీకి సొంత కార్యాలయాన్ని కూడ నిర్మించనున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. గుంటూరులో స్వంత ఇల్లు నిర్మించుకోవడం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకొంటాం
జనసేన పార్టీపై ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ చప్పారు. అయితే ప్రజల విశ్వాసాన్ని తాను ఏనాడూ వమ్ము చేయబోనని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొనేందుకు తాను అన్ని రకాలుగా శ్రమిస్తున్నట్టు చెప్పారు. తమ పార్టీకి ప్రజల సహకారం ఉండాలని ఆయన కోరుకొన్నారు.
గుంటూరులో ఇంటి నిర్మాణపనులకు పవన్ భూమి పూజ
సమయం వచ్చినప్పుడు ఆస్తుల ప్రకటన
సమయం వచ్చినప్పుడు ఆస్తులను ప్రకటించనున్నట్టు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎప్పుడు ఆస్తులను ప్రకటిస్తాననే విషయాన్ని మాత్రం ఆయన ప్రకటించలేదు. అయితే సమయం వచ్చినప్పుడు మాత్రమేనని పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ తన ఆస్తులను ప్రకటించే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తా
మార్చి 14, పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణను వెల్లడించనున్నట్టు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర ప్రజల సమస్యలపై తమ పార్టీ చేయబోయే పోరాటాలపై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ విషయమై మీడియా ప్రతినిధులు ఒక్క రోజు ఓపికగా ఉండాలని నవ్వుతూ పవన్ కళ్యాణ్ చెప్పారు.
నాన్న పనిచేసిన చోటే ఇల్లు
గుంటూరు జిల్లా మంగళగిరిలో మా నాన్న కానిస్టేబుల్గా పనిచేశాడని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకొన్నాడు. ఆ ప్రాంతంలోనే తాను స్వంత ఇల్లు కట్టుకోవడం తనకు సంతోషంగా ఉందన్నారు. సమస్యల నుండి తాను ఏనాడూ కూడ పారిపోలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు.తనకు వ్యక్తిగతంగా ఎవరితో కూడ శత్రుత్వం లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు.