రంగంలోకి డీఎల్: అనుచరులతో మంతనాలు, టిడిపిలోకేనా?
కడప: క్రియాశీలక రాజకీయాల్లోకి తిరిగి వస్తానని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ప్రకటించారు.2014 ఎన్నికల నుండి డీఎల్ రవీంద్రారెడ్డి రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. అయితే ఆయన టిడిపిలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. అయితే ఏ పార్టీలో చేరే విషయాన్ని డీఎల్ రవీంద్రారెడ్డి మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
రెండు మాసాల క్రితం డీఎల్ రవీంద్రారెడ్డి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో సమావేశం కావడం కూడ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. అయితే వైసీపీలో కూడ డీఎల్ చేరుతారనే ప్రచారం కూడ సాగింది.
టిడిపిలో చేరితే 2019 ఎన్నికల్లో మైదుకూరు అసెంబ్లీ స్థానం నుండి డీఎల్ రవీంద్రారెడ్డి పోటీ చేసేందుకు టిడిపి నాయకత్వం సానుకూలంగా స్పందించిందనే ప్రచారం కూడ సాగుతోంది. మైదుకూరు టిడిపి ఇంచార్జీగా ఉన్న సుధాకర్యాదవ్కు టిటిడి ఛైర్మెన్ పదవి ఇవ్వనున్నారని ప్రచారం కూడ సాగింది.

క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తా
కార్యకర్తలు, అభిమానుల సలహాలు తీసుకొని త్వరలోనే క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని, ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తానని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ప్రకటించారు. గత సార్వత్రిక ఎన్నికల నుండి డీఎల్ రవీంద్రారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే 2019 ఎన్నికలు ఏడాదిన్నర సమయంలో రానున్నాయి. దీంతో తాను క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నట్టు డీఎల్ రవీంద్రారెడ్డి చేసిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకొంది.

ఏనాడూ కక్ష సాధించలేదు
ఏనాడూ కూడ తాను కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ప్రకటించారు.ఓటు వేయలేదని, ఏ పార్టీలో వున్నారని కార్యకర్తలను వేధింపు చర్యలకు పాల్పడటం దారుణమన్నారు. అందరూ బాగుండాలి.. సమాజం బాగుపడాలి అనే ధోరణిలో నేతలు ఉండాలని డీఎల్ రవీంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు.

ప్రజలు తిరగబడే రోజుల వచ్చాయి
ప్రజల్లో విప్లవం వచ్చిందని తిరగబడే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ప్రజలు, కార్యకర్తల ఆదరాభిమానాలతో క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నానన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తానని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి హమీ ఇచ్చారు.అయితే డీఎల్ రవీంద్రారెడ్డి ఏ పార్టీలో చేరుతారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

డీఎల్ రవీంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి 68వ జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో అభిమానులు, కార్యకర్తలు నేతల మధ్య ఘనంగా నిర్వహించారు. చెర్లోపల్లెకు చెందిన కొంగాణి వెంకటరమణ 68 కిలోల కేక్ను తయారు చేయించి డీఎల్ రవీంద్రారెడ్డి, ఆయన సతీమణి డీఎల్ సుభద్రమ్మల చేతులతో కట్ చేయించారు. అనంతరం గజమాలతో ఆయనను సత్కరించారు.












Click it and Unblock the Notifications