మోడీపై పోటీ చేస్తా: శంకర్రావు, ఎక్కడి నుంచైనా ఓకె..
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై పోటీ చేసేందుకు తాను సిద్ధమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శంకర్రావు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశిస్తే తాను నరేంద్ర మోడీపై లేదా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్ మీద పోటీ చేస్తానని చెప్పారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశిస్తే దేశం నుంచి ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి తాను సిద్ధమేనని శంకరరావు స్పష్టం చేశారు. తెలంగాణ, సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని శంకరరావు ధీమా వ్యక్తం చేశారు. నేర చరిత్ర కలిగిన అభ్యర్ధులకు ఎన్నికలలో టిక్కెట్లు ఇవ్వరాదని అధిష్టానానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయని, అందులో 40 సీట్లు మహిళలకు, యువకులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొనడం జరిగిందని అన్నారు. తాను హైకమాండ్కు వీర విధేయుడనని, తనకంటే ఎవరైనా వీర విధేయులు ఉంటే చెప్పాలని ఆయన అన్నారు.
భువనగిరి ఎంపి టికెట్ నాదే: కోమటిరెడ్డి
నల్గొండ: జిల్లాలోని భువనగిరి పార్లమెంటు స్థానం తనకే వస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. పైరవీలు చేసేవారి కుటుంబాలకు టికెట్లు ఇవ్వడం వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని, టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించాలని అధిష్టానాన్ని కోరినట్లు చెప్పారు. సిట్టింగ్ అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ తెలిపారు.