కాంగ్రెస్ కార్యకర్తగానే మరణిస్తా, ఇంకా చెప్తా: కెవిపి
హైదరాబాద్: తనకు కాంగ్రెసు పార్టీ కార్యాలయం దేవాలయం వంటిదని, తాను కాంగ్రెసు కార్యకర్తగానే మరణిస్తానని పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు అన్నారు. మొదటి నుంచి తాను కాంగ్రెస్ కార్యకర్తనే అని, కష్టకాలంలో పార్టీ గెలుపు కోసం పనిచేశానని ఆయన అన్నారు. నూతనంగా ఎన్నికైన ముగ్గురు పార్లమెంటు సభ్యులు కెవిపి, సుబ్బరామిరెడ్డి, ఎంఏఖాన్లను పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గాంధీభవన్లో సన్మానించారు.
ఈ సందర్భంగా కెవిపి రామచందర్ రావు తీవ్ర ఉద్వేగానికి లోనై మాట్లాడారు. భవిష్యత్లోనూ తాను పార్టీ కార్యకర్తగా పని చేస్తానని స్పష్టం చేశారు. తాను పార్టీని వీడుతున్నట్లు తన మిత్రులు దుష్ప్రచారం చేశారని, ఆ ప్రచారాన్ని పట్టించుకోనని ఆయన అన్నారు. కాంగ్రెసులో తన పాత్రపై, తన ప్రస్థానంపై సుదీర్ఘంగా ప్రసంగించిన ఆయన మరిన్ని విషయాలను తాను మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్తానని అన్నారు.

కాసు బ్రహ్మానంద రెడ్డి వంటి మహామహులు ఉన్నప్పుడు తాను గాంధీ భవన్ ఇంచార్జీగా పనిచేశానని చెప్పారు. భవిష్యత్తులో తాను పార్టీలో ఉంటానా, లేదా అనే విషయంపై మిత్రులు ప్రచారం సాగిస్తున్నారని, ఆ ఊహాగానాలను తాను పట్టించుకోనని ఆయన అన్నారు. కాంగ్రెసు తరఫున వైయస్ రాజశేఖర రెడ్డి పోటీ చేస్తే గెలిపించానని చెప్పారు. ప్రతిష్టలు, విమర్శలు మూటగట్టుకున్నానని, కష్టాసుఖాలు అనుభవించానని అన్నారు. 2014 ఎన్నికల సమయంలో అందరికీ అందుబాటులో ఉండాలని తాను అనుకున్నట్లు తెలిపారు.
తాను 1990 నుంచి రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నానని, 2008లో ప్రయత్నాలు ఫలించాయని ఆయన అన్నారు. ఏనాడు కూడా తాను నిరాశానిస్ప్రహలకు లోను కాలేదని చెప్పారు. 1989 - 1994 మధ్య చేసిన కొన్ని పనులు పార్టీకి నష్టం కలిగించాయని, అందుకు కార్యకర్తలకు క్షమాపణలు చెబుతున్నానని ఆన్నారు.
తనను తిరిగి రాజ్యసభకు ఎంపిక చేసిన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డే తనను రాజ్యసభకు పంపించారని ఆయన అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications