ఇక గోడదూకి 'జంప్ జిలానీ'... ఆపై ఏం జరిగినా చంద్రబాబుదే బాధ్యత: ముద్రగడ ఫైనల్ వార్నింగ్
ప్రతి రోజూ ఇంటి నుంచి బయలుదేరి పాదయాత్రకు సిద్ధం కావడం, ఆపై పోలీసులు అడ్డుకోవడంతో వెనక్కు వెళ్లిపోతున్న కాపు వర్గం నేత ముద్రగడ పద్మనాభం శుక్రవారం ఏపీ ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
అమరావతి: ప్రతి రోజూ ఇంటి నుంచి బయలుదేరి పాదయాత్రకు సిద్ధం కావడం, ఆపై పోలీసులు అడ్డుకోవడంతో వెనక్కు వెళ్లిపోతున్న కాపు వర్గం నేత ముద్రగడ పద్మనాభం శుక్రవారం ఏపీ ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
తనను పాదయాత్రకు వెళ్లనీయకుండా పోలీసులు తన ఇంటి ముందే కాపుకాయడం.. తన హక్కులను కాలరాయడమేనని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక ఏదో ఒక రోజు ఎవరికీ చెప్పకుండా రాత్రిపూట గోడ దూకి నడక మొదలు పెడతానని, ఆపై జరిగే పరిణామాలకు చంద్రబాబుదే పూర్తి బాధ్యతని స్పష్టం చేశారు.
తాను కూడా 'జంప్ జిలానీ'గా మారతానని చెబుతూ, తనను శాంతియుతంగా పాదయాత్ర చేసుకోనివ్వాలని చేతులెత్తి మొక్కుతూ పోలీసులను ముద్రగడ కోరారు. అంతకుముందు ముద్రగడ బయటకు రాగా, పోలీసులు అడ్డుకున్నారు.
ఇందుకు నిరసనగా ముద్రగడ తన ఇంటిముందే ఒకరోజు నిరసనకు కూర్చుంటున్నట్టు ప్రకటించి అక్కడే బైఠాయించారు. ఈ విషయం తెలిసి ఆయన్ని కలిసేందుకు కొందరు కాపు నేతలు అక్కడికి రాగా, ముద్రగడ కాసేపు వారితో మాట్లాడారు.